దళపతి విజయ్కు బిగ్ షాక్: రూ. 1.5 కోట్ల జరిమానా కట్టాల్సిందే.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు!
Actor Vijay IT Case: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది.
Actor Vijay IT Case: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ. 1.5 కోట్ల పెనాల్టీని రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ జరిమానాను వెంటనే చెల్లించాలని స్పష్టం చేస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
అసలేంటి ఈ వివాదం?
2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను లెక్కల్లో విజయ్ అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ శాఖ ఆరోపించింది. 2015లో విడుదలైన 'పులి' సినిమాకు గానూ విజయ్ రూ. 15 కోట్ల పారితోషికం అందుకున్నారు. ఇందులో రూ. 10 కోట్లు చెక్కు రూపంలో, మిగిలిన రూ. 5 కోట్లను నగదు రూపంలో తీసుకున్నారని ఐటీ అధికారులు గుర్తించారు. ఈ 5 కోట్ల రూపాయలను విజయ్ తన ఆదాయపు పన్ను రిటర్న్స్లో చూపలేదని, ఉద్దేశపూర్వకంగానే పన్ను ఎగ్గొట్టారని అధికారులు దర్యాప్తులో తేల్చారు.
కోర్టు తీర్పు ఇదే..
ఆదాయాన్ని తక్కువగా చూపినందుకు గానూ ఐటీ శాఖ ఆయనకు రూ. 1.5 కోట్ల పెనాల్టీ విధించింది. దీనిపై విజయ్ గతంలోనే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం, గత నెల 23న తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పును వెలువరిస్తూ.. పన్ను ఎగవేత జరిగినట్లు స్పష్టమవుతోందని, ఐటీ శాఖ విధించిన పెనాల్టీని విజయ్ చెల్లించాల్సిందేనని జడ్జి ఆదేశించారు.