ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఇద్దరు ఎస్పీలు, ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసిన ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠపై వేటు వేసింది. ఎన్నికల విధులకు దూరం చేసింది. కొత్త సీఎస్గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన్ని ఎన్నికల విధుల నుంచి తప్పించింది. 1983 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కొత్త సీఎస్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఇవాళ ఉదయం సీఎస్గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఇదే పదవిలో బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వులో వెల్లడించింది.
ఇటీవల రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను సీఎస్ అనిల్ చంద్ర పునేఠా బేఖాతరు చేయడంతో సీరియస్ అయ్యింది. ఆయన్ని ఢిల్లీకి పిలిచించిన ఈసీ ఐపీఎస్ ల బదిలీలపై వెంటవెంటనే జారీ చేసిన మూడు జీవోలపై వివరణ కోరింది. తొలుత ఈసీ ఆదేశాల ప్రకారం ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్రావును బదిలీ చేయగా తర్వాత ఆయన్ని అదే పదవిలో నియమిస్తూ మరో జీవో జారీ చేశారు. అలాగే ఎన్నికల సంఘం ఆదేశాలు వర్తించవంటూ హైకోర్టును ఆశ్రయించడంపైనా ఈసీ సీరియస్ అయ్యింది.
అయితే పునేఠాపై ఈసీ చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏ తప్పూ చేయకుండానే పునేఠాను బదిలీ చేశారని ఇందులో ప్రతిపక్ష పాత్ర ఉందని ఆరోపించారు. మరోవైపు ఇదే వ్యవహారంలో రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ శుక్రవారం ఈసీ ఎదుట హాజరయ్యారు. అయితే ఆలోపే డీజీపీ ఠాకూర్ను ఏసీబీ డీజీ విధుల నుంచి తప్పిస్తూ పునేఠా ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.