ఓ తిమింగలం ఆడ తోడు కోసం మూడు సముద్రాలు దాటి 19 వేల కిలోమీటర్లు ప్రయాణించడంపై సైంటిస్టులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. మనుషులే కాదు నోరు లేని జీవాలు సైతం ఆడ తోడు కోసం అన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించడం గమనార్హం. దీనిపై బజారుటో సెంటర్ ఫర్ సైంటిఫిక్ స్టడీస్ అధ్యయనం చేసింది. ఓ మగ తిమింగలం తగిన తోడు వెతుక్కొని పిల్లల్ని కనేందుకు ఏకంగా మూడు సముద్రాలు దాటి 19 వేల కిలోమీటర్లు ప్రయాణించిందని వెల్లడించింది.
తిమింగలం ప్రయాణాన్ని ఏఐ అల్గారిథం సాయంతో ఫొటో రికార్డింగ్ చేసి విశ్లేషించినట్టు తెలుస్తోంది. కొలంబియాలోని గల్ఫ్ ఆఫ్ ట్రిబుగా నుంచి ఈ తిమింగలం వలస ప్రయాణం ప్రారంభమై.. టాంజానియాలోని జాంబిబార్ తీరం వరకు జరిగింది. అయితే ఈ తిమింగలం వలస ప్రయాణం చేయడానికి గల నిర్ధిష్ట కారణాలపై శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. పర్యావరణ మార్పులు, తోడు కోసం అనుసరించే వ్యూహాల్లో మార్పులు లేదా వనరుల మీద ఆధిపత్యం కోసం ఈ తిమింగలం సుదూర ప్రయాణం సాగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే తిమింగలం జర్నీ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.