Donald Trump: భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. నాకు నోబెల్ రావాలి అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
భారత్–పాకిస్థాన్ మధ్య 2025లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను తన జోక్యంతోనే అడ్డుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు
Donald Trump: భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా.. నాకు నోబెల్ రావాలి అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
భారత్–పాకిస్థాన్ మధ్య 2025లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను తన జోక్యంతోనే అడ్డుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్లో చమురు సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ట్రంప్.. తాను రంగంలోకి దిగకపోతే ఇరు దేశాల మధ్య అణు యుద్ధమే జరిగేదని అన్నారు. తన చొరవ వల్లే కనీసం కోటి మంది ప్రాణాలు దక్కాయని పాకిస్థాన్ ప్రధాని స్వయంగా బహిరంగంగా చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.
తన అధ్యక్ష పదవీ కాలంలో ఇప్పటివరకు ఎనిమిది ప్రధాన యుద్ధాలను పరిష్కరించానని ట్రంప్ వెల్లడించారు. “చరిత్రలో నాకంటే ఎక్కువగా నోబెల్ శాంతి బహుమతికి అర్హులు ఎవరూ లేరు. మూడుదశాబ్దాలుగా పరిష్కారం లేని సమస్యలను కూడా నేను పరిష్కరించాను. భారత్–పాక్ మధ్య అప్పటికే ఎనిమిది యుద్ధ విమానాలు కూలిపోయాయి. పరిస్థితి అదుపు తప్పుతున్న వేళ నేను జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపాను” అని ఆయన వ్యాఖ్యానించారు. నోబెల్ అవార్డు కంటే కోట్లాది మంది ప్రాణాలను కాపాడటమే తనకు ముఖ్యమని ట్రంప్ చెప్పారు.
అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ మొదటి నుంచే ఖండిస్తోంది. 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందడంతో భారత్ మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఈ ఆపరేషన్లో పాకిస్థాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. అనంతరం పరిస్థితి తీవ్రతను గ్రహించిన పాక్.. మే 10న తన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ (డీజీఎంవో) ద్వారా భారత్ను సంప్రదించి కాల్పుల విరమణ కోరిందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి మూడో పక్షం జోక్యం లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ తేల్చి చెప్పింది. ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవాలకు భిన్నమని భారత్ మరోసారి స్పష్టంగా ఖండిస్తోంది.