Online Gaming: గేమ్స్ ఆడొద్దన్నారని 9వ అంతస్తు నుంచి దూకిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు
ఆన్లైన్ గేమింగ్ వ్యసనంతో బాధపడుతున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు గాజియాబాద్లో 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Online Gaming: గేమ్స్ ఆడొద్దన్నారని 9వ అంతస్తు నుంచి దూకిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు
Online Gaming: ఆన్లైన్ గేమింగ్ వ్యసనం మరో విషాదానికి దారి తీసింది. ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని మందలించారనే కారణంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్ప్రదేశ్లోని గాజియాబాద్లో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గాజియాబాద్లోని ఓ రెసిడెన్షియల్ టౌన్షిప్లో నివసిస్తున్న కుటుంబానికి చెందిన 12, 14, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు తోబుట్టువులు ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడ్డారు. కరోనా కాలంలో ఫోన్ వినియోగం పెరిగిన క్రమంలో, క్రమంగా ఆన్లైన్ గేమ్స్ ఆడటం వారికి వ్యసనంగా మారినట్లు తెలుస్తోంది.
ఆన్లైన్ గేమింగ్ కారణంగా చదువుపై ఆసక్తి తగ్గి, స్కూల్కు వెళ్లడాన్ని కూడా మానేశారని పోలీసులు తెలిపారు. పిల్లల ప్రవర్తనపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి ఈ విషయమై ఇంట్లో వాగ్వాదం జరిగిన అనంతరం, ముగ్గురు తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అపార్ట్మెంట్లోని 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. శబ్దం వినిపించడంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. అపార్ట్మెంట్ ప్రాంగణంలో మృతదేహాలను గుర్తించిన పోలీసులు వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆన్లైన్ గేమింగ్ వ్యసనం పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.