కృష్ణా జిల్లా బాలుడి హత్యలో వీడని మిస్టరీ

Update: 2019-08-06 12:18 GMT

ముక్కుపచ్చలారని మూడో తరగతి చదువుతున్న బాలుడి హత్యతో కృష్ణా జిల్లా అవనిగడ్డ ఉలిక్కిపడింది. చల్లపల్లి బీసీ హాస్టల్‌లో ఈ దారుణం జరిగింది. అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. మూడో తరగతి చదువుతోన్న ఆదిత్యను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతకంగా గొంతుకోసి చంపేశారు. అసలు ఆ హత్య ఎలా జరిగింది..? ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా..? లేక మరేదైనా కారణం ఉందా..? అనే దానిపై పలువురు చర్చించుకుంటున్నారు. ఈ కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

దాసరి రవి ఆదిలక్ష్మిలకు పుట్టిన నాలుగో సంతానమే ఆదిత్య. ఎనిమిదేళ్ల ఉన్న ఆదిత్య అన్నతో కలిసి హాస్టల్‌లో ఉంటున్నాడు. ఏడుతరగతి చదువుతోన్న అన్న అశోక్‌ లేచేసరికి తమ్ముడు ఆదిత్య కనిపించకపోవడంతో వాచ్‌మెన్‌కు చెప్పాడు. అందరూ ఆదిత్య కోసం వెతుకుతుండగా... బాత్‌రూంలో శవమై కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

బాలుడిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందా అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తమకు ఎవరితో ఎలాంటి ఆస్తి గొడవలు కూడా లేవని.. అసలు ఒకరితో గొడవలు పడేంత ఆస్తి కూడా తమకు లేదని బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమారుడు బాగా చదువుకుంటాడని హాస్టల్ లో చేర్పిస్తే... ఇలా శవమై కనిపిస్తాడని ఊహించలేదని ఆదిత్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కాగా, ఈ ఉదయం బాలుడు ఆదిత్య బాత్‌రూంలో రక్తం మడుగులో కనిపించడంతో.. వెంటనే హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

చల్లపల్లి సీఐ వెంకటనారాయణ, ఎస్సై నాగరాజు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించి విచారణ చేపట్టారు. ఆదిత్య మెడవద్ద కత్తితో కోసినట్లుగా ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించాడా? లేదా ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Tags:    

Similar News