Hyderabad: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం..నలుగురు నిందితుల అరెస్ట్
Hyderabad: హైదరాబాద్ కేపీహెచ్బీలో డ్రగ్స్ పట్టివేత. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద నలుగురిని అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు. ఎల్ఎస్డీ, ఎండీఎంఏ స్వాధీనం.
Hyderabad
Hyderabad: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో శేర్లింగంపల్లి ఎస్ఓటీ (SOT) పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నలుగురు నిందితులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి ఎల్ఎస్డీ స్టాంపులు, ఎండీఎంఏ వంటి ఖరీదైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద శేరిలింగంపల్లి ఎస్ఓటీ పోలీసులు సోడాలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన నలుగురిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద నిషిద్ధ మాదకద్రవ్యాలు బయటపడ్డాయి.
నిందితుల నుంచి 9 ఎల్ఎస్డీ (LSD) స్టాంపులు, 4 గ్రాముల ఎండీఎంఏ (MDMA), 150 గ్రాముల ఎండు గంజాయితో పాటు మూడు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మత్తు పదార్థాల విలువ మార్కెట్లో లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పట్టుబడిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.