ఉత్తరప్రదేశ్ లో దారుణం: భార్యను చంపి..ఆమె తలతో రోడ్లమీద నడుస్తూ..

Update: 2020-02-02 08:23 GMT

అదుపు చేయలేని ఆవేశం మనుష్యులతో ఎంత పనైనా చేయిస్తుంది. ఒక్కోసారి ఆ వేషంలో ఉన్మాదం ఆవరించి విపరీతంగా ప్రవర్తిస్తారు. కొన్ని సంఘటనలు ఆవేశం, కోపం అదుపులో లేకపోతే ఇదిగో ఇలాగే చేస్తారు. మొన్నామధ్య విజయవాడలో జరిగిన సంఘటన లాంటిదే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేసి ఆమె తలను ఖండించి చేత్తో పట్టుకుని కిలోమీటరున్నర దూరం రోడ్లమీద నడుచుకుంటూ వెళ్లి హల్చల్ చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని జహంగిరాబాద్‌ పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలోని బహదుర్‌పురా గ్రామానికి చెందిన అకిలేశ్‌ రావత్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతనికి రెండు సంవత్సరాల క్రితం అదే ప్రాంతానికి చెందిన రజని అనే యువతితో వివాహమైంది. వీరికి ఓ పాప పుట్టి కొద్దిరోజులకే అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం రావత్, రజని మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది.

ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన రావత్ భార్యను ఇంట్లో నుంచి బయటకు లాగి పదునైన కత్తితో మెడ కోసేశాడు. అనంతరం శరీరం నుంచి తలను వేరుచేసి కిలోమీటరున్నర దూరం పిచ్చిపట్టినవాడిలా ప్రవర్తిస్తూ నడుచుకుంటూ వెళ్లాడు. అతడి చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని కదిర్‌పూర్ అనే గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. రావత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Tags:    

Similar News