కాగజ్నగర్: కొమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని సీతానగరం గ్రామంలో విషాద ఘటన జరిగింది. భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి మనస్తాపంతో 18నెలల కూతురికి ఉరి వేసి, తానూ ఉరేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లీబిడ్డా ఇద్దరూ మరణించారు. జయ బిస్వాస్(28), ప్రదీప్ భార్యాభర్తలు. వారికి కృషి అనే 18నెలల పాప ఉంది. ప్రదీప్ తాపీ పని చేస్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే ప్రదీప్కు మరో మహిళ పరిచయమైంది. దాదాపు ఆరు నెలల నుంచి ఇద్దరూ సహ జీవనం చేస్తున్నారు. ఈ విషయం జయకు తెలిసింది. భర్తను నిలదీసింది. భార్యపై కోపగించుకున్న ప్రదీప్... తనతో సంబంధం పెట్టుకున్న మహిళతో కలిసి ఉంటానని తెగేసి చెప్పాడు.
ఇంటి నుంచి వెళ్లి ఆమెతోనే కలిసుంటున్నాడు. భర్త ప్రవర్తనతో మనస్తాపం చెందిన జయ 18 నెలల కూతురిని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది. కోల్కతా నుంచి ఉపాధి కోసం వచ్చిన ఈ దంపతులకు తొమ్మిది సంవత్సరాల క్రితం పెళ్లైంది. పాపతో పాటు ఇద్దరు కొడుకులున్నారు. ప్రదీప్పై, ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని జయ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను సిర్పూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మంగళవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.