కుటుంబకలహాలతో కట్టుకున్న భర్తను హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం కేశవరంలో జరిగింది. గ్రామానికి చెందిన మల్లేష్ ,జ్యోతి దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. గత కొంత కాలంగా దంపతులమధ్య కలతలు వచ్చాయి. ఈ క్రమంలో గత నెల 3న మద్యం మత్తులో ఉన్న మల్లేష్, భార్యతో గొడవపడ్డాడు. ఆ సమయంలో వీరిమధ్య తీవ్రమైంది. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. దీంతో జ్యోతి అతడిని తోసివేయడంతో కిందపడిన మల్లేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతను ఎంతకూ లేవకపోవడంతో భర్త మృతిచెందాడని గుర్తించి ఆందోళనకు గురైన ఆమె.. శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టింది. వర్షం కురవడంతో మృతదేహం కుళ్లి దుర్వాసన రావడంతో ఆమె ఈ నెల 2న అర్ధరాత్రి శవాన్ని బయటకుతీసి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల గోతిలో పారవేసింది. అయితే ఈ తతంగాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారమందించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.