రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారాయి. పెట్రో భారం పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపుతూ ఉండటంతో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పెట్రో ఉత్పత్తుల పెరుగుదల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాలు పెరుగుతుంటే .. సామాన్యుల నడ్డి విరుగుతోంది. తాజాగా పెట్రోల్ లీటర్కు 30 పైసలుకు పైగా పెరగ్గా, పలు మెట్రో నగరాల్లో డీజిల్ ధరలు లీటర్కు 40 పైసలు పైగా పెరిగాయి. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ సోమవారం రూ 84.10 పైసలకు చేరింది. అయితే భారం నుంచి తప్పించుకోలేక అల్పాదాయ, మద్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో వాహనాల ద్వారా పంపిణీ అయ్యే నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి.
పరిస్ధితి ఇలా ఉంటే పెట్రో కంపెనీలు పైసల్లో ధరలు పెంచుతుంటే .. ప్రభుత్వం టాక్సుల రూపంలో సామాన్యుడిపై మరింత భారం మోపుతోంది. ప్రజలను వీటి భారం నుంచి తప్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ .. ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారు. రాష్ట్రాల స్ధాయిలో పన్నులు తగ్గించాలంటూ కేంద్రం కోరితే .. ఆ పనేదో మీరు చేయండి అంటూ రాష్ట్రాలు కోరుతూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో వినియోగదారుడికి భారం తప్పడం లేదు.
అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం గత మేలో బ్యారెల్ ముడి చమురు ధర 80.42 డాలర్లకు చేరుకుంది. తరువాత నెలలోపే 70.55 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు 77.42 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఓ వైపు ధరలు తగ్గిన సమయంలో కూడా చమురు కంపెనీలు ధరలు పెంచడం ..ఇందుకు ప్రభుత్వం కూడా అనుమతివ్వడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నిత్యం ధరల పెంపుపై తీవ్ర స్ధాయి ఆరోపణలు రావడంతో ... రూపాయి పతనం కావడం వల్లే ధరలు పెంచాల్సి వస్తోందంటూ చమురు కంపెనీలు సమర్ధించుకుంటున్నారయి. చమురు ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నా ప్రభుత్వాలు కనికరం చూపడం లేదనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.