ఫైర్ బ్రాండ్ రాములమ్మ, తెలంగాణ ఎన్నికల తెరపై ధూంధాం చేసేందుకు సిద్దమయ్యారు. మొన్నటి వరకు అలకపాన్పుపై ఉన్న విజయశాంతికి, స్టార్ క్యాంపెనర్గా బాధ్యతలు అప్పగించడంతో, ఇక చెలరేగిపోవాలని డిసైడయ్యారు. ఊరూవాడా తిరుగుతూ, కేసీఆర్కు దీటుగా విమర్శల బాణాలు సంధించాలని సిద్దమయ్యారు. మరి మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న రాములమ్మ, ఇక తెలంగాణ పోరులో కాంగ్రెస్కు తురుపు ముక్కగా మారారా?
దక్షిణ భారత సినీ రంగంలో విశ్వ నట భారతిగా వినుతికెక్కారు విజయశాంతి. తెలుగు, తమిళ, కన్నడ వంటి భాషల్లో హీరోలకు దీటుగా వెండితెరపై చెలరేగిపోయారు. ముఖ్యంగా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన రాములమ్మ వంటి సినిమాలతో, జనం గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సిల్వర్ స్క్రీన్పైనే కాదు, పొలిటికల్ స్క్రీన్పైనా విజయశాంతి తనదైన ముద్ర వేశారు. భావోద్వేగ ప్రసంగాలతో ఉర్రూతలూగించారు. మొదటి నుంచి తెలంగాణ నినాదంతో, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. అనేక పార్టీలు మారి, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు.
తెలంగాణ శాసన సభకు ఎన్నికల నగారా మోగడంతో, మరోసారి విజయశాంతి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను ఉపయోగించుకోవాలని డిసైడయ్యింది కాంగ్రెస్. ఎన్నికల కమిటీలు ప్రకటించిన ఏఐసీసీ, విజయశాంతికి కీలక బాధ్యతలు అప్పగించింది. స్టార్ క్యాంపెనర్గా ప్రచారం హోరెత్తించాలని కర్తవ్యబోధ చేసింది. గతంలో కేసీఆర్తో కలిసి నడిచిన విజయశాంతి, ఇక గులాబీ అధినేతపై విమర్శల బాణాలను ఎక్కుపెట్టేందుకు సిద్దమయ్యారు. అతిత్వరలో క్యాంపెన్ ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు.