ఇప్పటికే నియోజకవర్గాల్లో నాయకుల సమన్వయలోపంతో సతమతమవుతున్న వైసీపీకి గుంటూరు జిల్లాలో మరో కొత్త సమస్య వచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేసేదిశగా అడుగులు పడుతున్నాయనే చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం పార్టీలో ఇటీవల జరిగిన పరిణామమే.. ప్రస్తుతం మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట ఇంచార్జి గా ఉన్నారు. అయితే అదే నియోజకవర్గానికి చెందిన టీడీపీ మహిళ నేత విడదల రజినీకుమారి శుక్రవారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో ఆమె అలా పార్టీలో చేరిందో లేదో ఆమెను వెంటనే నియాజకవర్గ కో ఆర్డినేటర్ గా నియమించింది అధిష్టానం. ఈ పరిణామం మర్రి రాజశేఖర్ కు రుచించలేదు. దీంతో ఆదివారం మధ్యాహ్నం కార్యకర్తలతో సమావేశమై భవిశ్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆయనను వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే తనకు సీటు గ్యారెంటీ ఇస్తేనే పార్టీలో ఉంటానని బొత్సకు తేల్చి చెప్పారట. ఇదిలావుంటే నిన్న సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడిన విడదల రజిని.. తాను పార్టీలో చేరేముందు మర్రి రాజశేఖర్ ను కలిశానని. తిరుపతి వెళుతున్న సందర్బంగా తన చేరిక సమయంలో రాజశేఖర్ రాలేదని అన్నారు. త్వరలోనే ఆయనను కలిసి పార్టీ కార్యకర్తలు, నేతలను పరిచయం చేసుకుంటానని అన్నారు.