ఆకతాయిల ఈవ్ టీజింగ్ కు సామాన్యులే కాదు కేంద్ర మంత్రులు కూడా బాధితులే అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ నిన్న అర్ధరాత్రి ఈవ్ టీజింగ్ కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం మీర్జాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె... తిరిగి వారణాసికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
మీర్జాపూర్లో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనుప్రియ తిరిగివస్తున్న సమయంలో ముగ్గురు యువకులు కారులో ఆమె కాన్వాయ్ను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని హెచ్చరించారు. అయినా పట్టించుకోని ఆకతాయిలు మంత్రి, సెక్యూరిటీ సిబ్బందిని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు. యువకుల ప్రయాణిస్తున్న కారుకు నెంబర్ ప్లేట్ లేదు. మంత్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆకతాయిలను అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా, మహిళల రక్షణ కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యూపీలో యాంటీ రోమియో స్క్వాడ్స్ను నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఆశించిన స్థాయిలో ఈ స్క్వాడ్స్ ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఏకంగా కేంద్రమంత్రిపైనే ఆకతాయిలు వేధింపులకు దిగడం యూపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.