లెజండరీ నటి, లేడీ సూపర్స్టార్ శ్రీదేవి మృతిపై ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతున్నాయ్. గుండెపోటుతో మృతి చెందారని బోనీకపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ చెబితే ప్రమాదవశాత్తు బాత్ టబ్లో మృతి చెందారని దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్ట్లో సంచలన అంశాలు బయటపడ్డాయ్. మరణం నుంచి ఫోరెన్సిక్ రిపోర్ట్ వరకు అన్ని మలుపులే.
తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీదేవి భౌతిక కాయాన్ని చెడిపోకుండా ‘ఎంబామింగ్’ ప్రక్రియ నిర్వహించి, మరికొన్ని రోజులు దుబాయ్ మార్చురీలోనే ఉంచాలని నిర్ణయించారు. ఎన్బామింగ్ మంగళవారం మధ్యాహ్నం చేస్తారని భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలోని అంశాల కారణంగానే శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్కు పంపించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుందని సమాచారం. సాధ్యమైనంత త్వరగా శ్రీదేవి భౌతికకాయాన్ని భారతదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని యూఏఈలోని భారతీయ రాయబారి నవ్దీప్ సూరి వెల్లడించారు.
మొదట కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లిన బోనీ ముంబైకి తిరిగొచ్చేసిన తర్వాత ఆ రెండ్రోజులు ఆమె బయటికి రాకుండా గదిలోనే ఉన్నారనే విషయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బోనీ, శ్రీదేవి కాల్ డేటాను పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరోవైపు ప్రాసిక్యూషన్ రంగంలోకి దిగడంతో రీ-ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ ఇన్వెస్టిగేషన్లో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి విచారణ జరుగుతుంది. ఫోరెన్సిక్ పూర్తి రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే కుట్ర జరిగిందా? లేదా ఆత్మహత్యా? లేదా సహజ మరణమా? అన్నది తేలనుంది. ఆ తర్వాతే శ్రీదేవి పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుమానాలున్న విషయం వాస్తవమే.. వీటిని నివృతి చేసుకునేందుకు న్యాయనిపుణులు, పోలీసు విభాగం ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం.