టెక్నాలజీని అందిపుచ్చుకొని దూసుకెళ్లటం తెలివైనోళ్లు చేసే పని. తాజాగా అలాంటి పనే చేపట్టింది తెలంగాణ పోలీసు యంత్రాంగం. ఏదైనా సమాచారాన్ని స్టేట్ వైడ్ ...ఏకకాలంలో పంపేలా కొత్త సాంకేతిక వ్యవస్థకు రూపకల్పన చేశారు. మొత్తం 31 జిల్లాల్లో 63వేల మంది పోలీస్ సిబ్బందికి ఏకకాలంలో సమాచారం పంపేలా మొబైల్ అప్లికేషన్ను రూపొందించారు.
తెలంగాణ పోలీస్ శాఖ మరో ముందగుడు వేసింది. దేశంలోనే తొలిసారిగా అత్యంత వేగవంతమైన పోలీసింగ్కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో పోలీసులందరినీ అనుసంధానం చేస్తూ సరికొత్త మొబైల్ అప్లికేషన్కు రూపకల్పన చేశారు. కాప్ కనెక్ట్ పేరుతో రూపొందించిన ఈ మొబైల్ యాప్ ను డీజీపీ ప్రారంభించారు. ఒకేసారి లక్ష మందికి సమాచారాన్ని, ఆడియో.... వీడియో సందేశాల్ని పంపేలా ఈ యాప్ను రూపొందించారు.
ఇప్పటివరకూ వాట్సాప్ గ్రూపుల మీద ఆధారపడుతున్న పోలీసులకు దానిలో ఉండే పరిమితి ఇబ్బందికరంగా మారింది. ఏ గ్రూపులో అయినా 256మందికి మించి పెట్టుకోవటానికి వీల్లేకపోవటంతో... రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సమాచారాన్ని పంపటం కష్టమయ్యేది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకే కాప్ కనెక్ట్ యాప్ను రూపొందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే ఈ యాప్ రూపకల్పన జరిగిందన్న డీజీపీ మహేందర్రెడ్డి.... హైదరాబాద్ పోలీస్ సాంకేతిక బృందమే దీన్ని రూపొందించిందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాంకేతికతను అందుబాటులోకి తెచ్చిన క్రెడిట్ తెలంగాణ పోలీసులకు దక్కిందన్నారు.
సాధారణ కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకూ అంతా ఒకే గ్రూపులో ఉండనున్నారు. దాంతో మరింత మెరుగైన పని తీరుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఏదైనా సమాచారాన్ని అందరికి సెకన్ల వ్యవధిలో పంపే వీలు ఉండటంతో పాటు... భద్రతా పరమైన ఆదేశాలకు ఇది చాలా సులువు అవుతుందని భావిస్తున్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ యాప్లో షేర్ అయ్యే సమాచారాన్ని వేరే వారికి పంపే వీలు ఉండదని చెబుతున్నారు.