Telangana Driving License: ఇకపై డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే... ఆ టెస్ట్‌ పాస్‌ కావాల్సిందే

Telangana Driving License Rules 2026: రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ విధానంలో కీలకమైన మార్పులు చేసింది.

Update: 2026-04-05 04:14 GMT

Telangana Driving License: ఇకపై డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే... ఆ టెస్ట్‌ పాస్‌ కావాల్సిందే 

Telangana Driving License Rules 2026: రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ విధానంలో కీలకమైన మార్పులు చేసింది. ఇప్పడి వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే రెండు దశల విధానం అమలులో ఉండేది. కానీ, ఇకపై మూడు దశల విధానం ద్వారా మాత్రమే డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేలా గైడ్‌లైన్స్‌ను రూపొందించారు. బాధ్యతాయుతమైన డ్రైవర్లను తయారుచేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.

మూడంచెల విధానం

సుప్రింకోర్టు మార్గదర్శకాలను అనుసరించి ఈ విధానాన్ని రూపొందించారు. ఈ కొత్త విధానం ప్రకారం, లెర్నర్‌ లైసెన్స్‌ కోసం ధరఖాస్తు చేసుకోవాలి అంటే మొదట అభ్యర్థులు ప్రభుత్వం నిర్వహించే ఆన్‌లైన్‌ రోడ్డు భద్రతా అవగాహన కోర్సును పూర్తిచేయాలి. ఈ కోర్సు మొత్తం మూడు గంటలపాటు ఉంటుంది. ఆరు మాడ్యూల్స్‌గా ఉంటుంది. ఇందులో ట్రాఫిక్‌ నిబంధనలు, సురక్షిత డ్రైవింగ్‌ పద్దతులు, ప్రమాదాల కారణాలు వంటి అంశాలను స్పష్టంగా వివరించనున్నారు. ఈ పద్దతిలో ప్రత్యేకంగా వీడియోల ద్వారా అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశం. నిజ జీవితంలో జరిగిన రోడ్డు ప్రమాదాల దృశ్యాలను చూపిస్తూ డ్రైవర్లు చేస్తున్న పొరపాట్లను అర్ధమయ్యేలా వివరిస్తారు. చేస్తున్న తప్పులతో పాటు, అద్ధాల వినియోగాన్ని కూడా తెలియజేస్తారు. అంతేకాదు, ఓవర్‌టేకింగ్‌ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, రాత్రి డ్రైవింగ్‌ విధానం వంటి అంశాలు ఇందులో ఉంటాయి.

యూనిక్‌ నంబర్‌

ఈ కోర్సు పూర్తయ్యాక అభ్యర్థులకు ఓ యూనిక్‌ సర్టిఫికేట్‌ నంబర్‌ను ఇస్తారు. ఈ నంబర్‌ ఉన్నవారికే ఎల్‌ఎల్‌ఆర్‌ కోసం అప్లై చేసుకుంటారు. దీన్నిబట్టి అభ్యర్థులు ఈ ఆన్‌లైన్‌ కోర్సు పూర్తి చేయకుండా లైసెన్స్‌ ప్రక్రియలో ముందుకు వెళ్లడం అసాధ్యమని చెప్పాలి. అయితే, ఈ పరీక్షను ఇంటినుంచే కంప్యూటర్‌ ద్వారా లేదా గుర్తింపు పొందిన డ్రైవింగ్‌ స్కూళ్లలో కూడా పరీక్షను రాయవచ్చు. దళారీల ప్రభావం తగ్గి వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

భారీ ప్రమాదాలు

దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. అనుభవం లేని డ్రైవర్లు, ట్రాఫిక్‌ నిబంధనలు తెలియకపోవడం ఈ ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నాయి. ప్రమాదాలను వీలైనంత వరకు తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, మూడంచెల విధానం అమలులోకి రావడంతో ఇక నుంచి లైసెన్స్‌ పొందడం కొంతమేర కఠినంగా మారినా, ప్రజల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతున్నది. డ్రైవర్లు రోడ్డుపైకి రావడానికి ముందు సరైన అవగాహన కలిగి ఉండటం ముఖ్యమని ఈ కొత్త విధానం తెలియజేస్తోంది.

Tags:    

Similar News