ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్...వరుస చేరికలకు టీఆర్ఎస్ ప్లాన్
వరుస చేరికలకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. వివిద పార్టీలకు చెందిన నేతలను కారెక్కించేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కొందరు కీలక నేతలకు గులాబీ కండువా కప్పి ప్రతిపక్షాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి వ్యూహం రచిస్తున్నారు..అధికార పార్టీ నేతలు. పాలమూరు జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు గులాబీ తీర్థం ఇవ్వడం ద్వారా చేరికలకు మరోసారి తెరలేపుతున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేకపోవడంతో అధికార టీఆర్ఎస్ మరోసారి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. విపక్షాల్లో ఉన్న అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. ఆపరేషన్ ఆకర్షలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కే. దామోదర్ రెడ్డి , వైసీపీ నేత ఎడ్మ కిష్టారెడ్డి, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం ఇవాళ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. వీరంతా కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు.
మొదటి నుంచి కాంగ్రెస్ వాది అయిన దామోదర్ రెడ్డి 2009లో టీఆర్ ఎస్ తరుఫున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ గూటికి చేరి ఎమ్మెల్సీ అయ్యారు. అయితే బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి నాగం రాకను ఎలాగైనా అడ్డుకోవాలనే లక్ష్యంతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసొచ్చారు. కానీ అధిష్టానం దామోదర్ రెడ్డి డిమాండ్ను పట్టించుకోకపోవడంతో గులాబీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతం వైసీపీలో ఉన్న కల్వకర్తి నియోజకవర్గ నేత ఎడ్మ కిష్టారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆయన కల్వకుర్తి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఎడ్మ కిష్టారెడ్డి 2014లో వైసీపీ తరుఫున కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం...2009 లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి చివరికి కారెక్కాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేసి కలకలం రేపిన మోత్కుపల్లి కూడా టీఆర్ఎసతో టచ్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అధికార పార్టీ అధినాయకత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.