రాహుల్ గాంధీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని తెలిపారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. కిరాయికి ప్రజలను తీసుకువచ్చి ర్యాలీలు తీశారని ఎద్దెవా చేశారు. కాంగ్రెస్ నేతల ముఖం చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా? అని దానం ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గ్రేటర్లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతేనని జోస్యం చెప్పారు. ఇక సెటిలర్స్ గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కు లేదన్నారు. అసలు సెటిలర్స్ను ఆకర్షించే మొహాలు కాంగ్రెస్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. బూత్ కమిటీలు ఏర్పాటు కాకుండానే టెలీ కాన్ఫరెన్స్ అంటూ రాహుల్ను మోసం చేశారన్నారు. ఈ విషయం రాహుల్కు తెలిస్తే ఉత్తమ్ ఉద్యోగం ఊడిపోతుందని చెప్పారు. తెలంగాణ గురించి రాహుల్ ఒక్కసారైనా పార్లమెంట్లో మాట్లాడారా అని అడిగారు. కాంగ్రెస్ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు చేసిందేమీ లేదని దానం చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ఉద్ఘాటించారు. సామాజిక న్యాయం గురించి రాహుల్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.