నేడు రాజ్యసభలో చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకోనుంది. ట్రిపుల్ తలాక్ బిల్లు పలు సవరణలతో రాజ్యసభ ముందుకు రానుంది. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ బిల్లుపై కేంద్ర కేబినెట్ కీలక మార్పులు చేసింది. భార్య వాదన విన్న తరువాత.. భర్తకు కోర్టు బెయిల్ ఇచ్చే అంశాన్ని చేరుస్తూ మార్పులు చేసింది. కొంతకాలనుంచి వ్యక్తమౌతున్న విమర్శలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఈ సవరణలు చేసింది.
కేంద్రం తాజాగా చేసిన సవరణల ప్రకారం తలాక్ చెప్పిన భర్తలపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయవచ్చు. అతడు కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందవచ్చు. ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యలకు విడాకులు ఇచ్చిన కేసులో పురుషులకు మేజిస్ర్టేట్ బెయిల్ మంజూరు చేయవచ్చనే నిబంధనను బిల్లులో చేర్చింది కేంద్ర క్యాబినెట్. ట్రిపుల్ తలాక్తో విడాకులు ఇవ్వడం చట్టవిరుద్ధమైన నేరంగా పరిగణిస్తూ భర్తకు మూడేళ్ల జైలు శిక్ష విధించే అంశాన్ని ఇదివరకే కేంద్రం చేర్చింది. తాజా సవరణ ప్రకారం శిక్షపడిన వ్యక్తి వాదనను పరిగణలోకి తీసుకుని మేజిస్ట్రేట్కు బెయిల్ మంజూరు చేసే అధికారాలుంటాయి. ఈ చట్టం ద్వారా బాధితురాలు తనకు, మైనర్ పిల్లలకు పరిహారం కోరుతూ మేజిస్ర్టేట్ను ఆశ్రయించవచ్చని బిల్లులో పేర్కొంది.