తిరుపతి రుయా ఆస్పత్రిలో కీచకపర్వం వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే లైంగిక వేధింపులకు దిగారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వేధింపులు భరించలేని ఎస్వీ మెడికల్ కళాశాల పీడియాట్రిక్ పీజీ ఫైనలియర్ విద్యార్థిని..... రుయా ప్రొఫెసర్లు కిరీటి, శశికుమార్, రవి కుమార్పై గవర్నర్కు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలంటూ ఈ మెయిల్ ద్వారా మొరపెట్టుకుంది. స్పందించిన గవర్నర్... విచారణ చేపట్టాల్సిందిగా హెల్త్ యూనివర్సిటీ వీసీకి ఆదేశాలు జారీ చేశారు.
పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, ప్రొఫెసర్ కిరీటి, ప్రొఫెసర్ శశికుమార్లు తన పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు గవర్నర్కు రాసిన లేఖలో వివరించింది. ప్రతిరోజు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, అభ్యంతరకర పదాలతో హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన ప్రాక్టికల్ పరీక్షలు వారి చేతుల్లోనే ఉన్నాయంటూ వాపోయింది. పలుమార్లు ఎస్వీ మెడికల్ కళాశాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. బాధిత మహిళ ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్... లైంగిక వేధింపులపై విచారణ చేపట్టాలని హెల్త్ వర్సిటీ వీసీని ఆదేశించారు.
రుయాఆస్పత్రి అనస్థీషియా విభాగాధిపతి జమున, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జయా భాస్కర్, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధా నాయక్లతో... హెల్త్ వర్సిటీ వీసీ విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ 4 రోజులుగా అత్యంత గోప్యంగా విచారణ చేస్తోంది. అయితే తాము ఎవరినీ వేధించలేదని రుయా ప్రొఫెసర్లు చెప్పుకొచ్చారు. ఫిర్యాదు చేసిన విద్యార్థిని మానసికస్థితి బాగోలేదని ఆరోపించారు. పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో నిందలు వేస్తోందన్నారు.