హైదరాబాద్లో మరో దారుణమైన ఘోరం జరిగింది. ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. దాంతో టోలిచౌకిలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బాలిక బంధువులు వందల సంఖ్యలో స్కూల్పై దాడి చేయడంతో పెద్దఎత్తున పోలీసులను మోహరించాల్సి వచ్చింది.
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. గోల్కొండ అజాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో మూడో తరగతి విద్యార్ధిని అత్యాచారానికి గురైంది. బాలిక నీరసంగా కనిపించడంతో తల్లిదండ్రులు నిలోఫర్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలికపై అత్యాచారం జరిగినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. బంధువులతో కలిసి బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో టోలిచౌకి, గోల్కొండలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అజాన్ ఇంటర్నేషనల్ స్కూల్పై బాలిక బంధువులు రాళ్ల దాడి చేశారు. స్కూల్ బస్సులు, కార్లను ధ్వంసం చేశారు. వందలాది మంది స్కూల్ దగ్గరకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో అప్పటికప్పుడు అదనపు బలగాలను రంగంలోకి దింపారు. సుమారు 300మంది పోలీసులు స్పాట్కి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. అయినా శాంతించని బాలిక బంధువులు ఆందోళన కొనసాగించారు. అయితే నిందితుడ్ని పట్టుకుని, కఠిన శిక్ష పడేలా చేస్తామంటూ పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్కూల్ యాజమాన్యానికి చెందిన వ్యక్తే అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పరారీలో ఉన్న నిందితుడు జిలానీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.