తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. నేతల తలరాతలు ఓట్లు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యాయి. అధికారయంత్రాంగం కౌంటింగ్ ఏర్పాట్లలో నిమగ్నం అయ్యింది. ఈ నెల 11 వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంతో ఎవరి తలరాతలు ఎలా మారుతాయో తెలియక అభ్యర్ధుల గుండెల్లో రైల్లు పరుగెడుతున్నాయి.
తెలంగాణలో ఎన్నికల మహా సంగ్రామం ముగిసింది. డిసెంబర్ 11 న అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు దారా ఇచ్చిన తీర్పు ఈవీవింల స్ట్రాంగ్ రూంలో భద్రంగా ఉంది. హైదరాబాద్ లో మొత్తం 14 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి,వికారాబాద్, తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు వికారాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో లెక్కించనున్నారు. జిల్లా కలెక్టర్ సయ్యద్ ఒమర్ జలీల్, ఎస్పీ అవినాష్ మహంతి ,జాయింట్ కలెక్టర్ అరుణకుమారి ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ఓట్ల లెక్కింపు నకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కౌంటింగ్ ను ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ చెప్పారు. మద్యాహ్నం లోపే పూర్తి పలితాలు వెలువడేలా చర్యలు తీసుకున్నామన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా కౌంటింగ్ ప్రారంబిస్తామని చెప్పారు. కౌంటింగ్ సరళిని వీక్షించేదుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోను భారీ బందోబస్తు మద్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలలో భద్ర పరిచారు. ఆదిలాబాద్, బోధ్, నిర్మల, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల ఈవీఎంలను ఆదిలాబాద్ లో భద్రపరిచారు. మంచిర్యాల,చెన్నూరు,బెల్లంపల్లి నియోజకవర్గాలకు సంబందించిన ఈవీఎంలను మంచిర్యాలలోని వ్యవసాయ మార్కెట్ లో, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలను ఆసిఫాబాద్ లో భారీ భద్రత మద్య భద్రపరిచారు. కౌంటింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
నిజామాబాద్ జిల్లాలో కౌంటింగ్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలలో పోలైన ఈవిఎమ్ బాక్స్ లను స్ట్రాంగ్ రూములకు చేర్చారు. నల్లగొండ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు,సూర్యాపేటలో నాలుగు, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు నకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలోనూ ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపుపై దృష్టి సారించారు. అభ్యర్ధుల గెలుపు ఓటములపై జోరుగా చర్చించుకుంటున్నారు. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరగటం ఎవరికి లాభం చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.