1994నాటి గూఢచర్యం కేసులో మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ అరెస్టుకు సంబంధించిన కేసులో కేరళ పోలీసులు వ్యవరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడమే కాక చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంది. దాంతో ఆయనకు అనుకూలంగా తీర్పు చెబుతూ.. అతనికి 50 లక్షల రూపాయల పరిహారాన్ని కేరళ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పింది. ఈ మొత్తం ఎనిమిది వారాల్లోనే ఇవ్వాలని ఆదేశించింది. అసలు వివరాల్లోకి వెళితే. భారత అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన రహస్యాలను విదేశాలకు అమ్మేశారని 1994లో నారాయణన్తోపాటు మరో శాస్త్రవేత్త శశికుమారన్ లపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కేరళలో ఉంటున్న మహిళ మరియం రషీదా, మరో ముగ్గురికి నారాయణన్ ఈ సమాచారాన్ని ఇచ్చారని కేరళ పోలీసులు అభియోగం మోపారు.
ఆ తర్వాత కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపించింది ప్రభుత్వం. అందులో రహస్యాలు ఇతరులకు చేరవేత వంటి అంశాలు ఏవి రుజువు కాకపోవడం,అసలు నారాయణన్ ఏ తప్పూ చేయలేదని వెల్లడైంది. ఆ సమయంలో దాదాపు రెండు నెలలపాటు ఆయన జైలులో ఉన్నారు. అయితే తనను అక్రమంగా అరెస్టు చేసిన కేసుకు బాధ్యులైన నాటి పొలిసు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ తను దాఖలు పిటిషన్ ను కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో నారాయణన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. అయన అరెస్ట్ అక్రమమని, ఆలా వ్యవహరించినందుకు, అతను ఇబ్బందిపడ్డందుకు గాను నష్ట పరిహారంగా 50 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది. అంతేకాకుండా కేరళ ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకుని ఎనిమిది వారాల్లోగా డబ్బు చెల్లించాలని అందులో పేర్కొంది.