కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్

Update: 2018-09-29 09:32 GMT

తన పోరాటం గల్లీలోని టీఆర్ఎస్‌ నేతలతో కాదని ప్రగతి భవన్‌లోని కేసీఆర్‌తో అన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. మోడీతో కుమ్మక్కై తనపై కేసులు పెడితే భయపడేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల పాటు తన నివాసంలో జరిగిన ఐటీ రైడ్స్‌పై ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన .. కేసీఆర్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు.  కాంగ్రెస్ నేతలను చూసి అభద్రతకు గురవుతున్న కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని రేవంత్ విమర్శించారు. 2014 తరువాత ఒక్కసారి విదేశీ పర్యటన చేయని తాను .. విదేశాల్లో అకౌంట్లు ఎలా ఓపెన్ చేస్తానంటూ ప్రశ్నించారు. భారతీయుడిగా ఉన్న తనకు విదేశాల్లో అకౌంట్లు ఎలా ఇస్తారో తెలియకుండా విమర్శలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తన ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమని రేవంత్‌ ప్రకటించారు. అయితే కేసీఆర్‌ కుటుంసభ్యులు కూడా దీనికి సిద్ధమా? అంటూ సవాల్‌ విసిరారు. ‘మన ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ కోసం ప్రధాని మోదీకి లేఖ రాద్దాం. లేఖ రాసేందుకు 24 గంటలు సమయం ఇస్తున్నా. 24 గంటల్లో నా సవాల్‌కు బదులు ఇవ్వకుంటే కేసీఆర్‌ అవినీతి పరుడని ప్రజలకు అర్థమవుతుంది’ అని రేవంత్‌ అన్నారు.

Similar News