రేవంత్రెడ్డి అంబులపొది నిండుగా నింపుకొనే రణంలోకి దిగినట్లు కనిపిస్తోంది. గాంధీ భవన్ ఎంట్రీతోనే మంత్రి కేటీఆర్ ఫ్యామిలీపై ఆరోపణలు చేసిన రేవంత్ రెండో అస్త్రం సంధించడానికి సిద్ధమవుతున్నారు. కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా కోర్టు మెట్లు కూడా ఎక్కుతానని హెచ్చరించారు.
రేవంత్ రెండో అస్త్రాన్ని సిద్దచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు కేవలం ముఖ్యమంత్రి కుటుంబాన్ని టార్గెట్ చేసిన రేవంత్ తరువాతి దఫాలో డైరెక్ట్గా ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తన రాజీనామా అంశాన్నే అస్త్రంగా చేసుకొని ప్రభుత్వంపై దాడి చేయాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించకపోయినా.. తనే సభలో లేవనెత్తి పార్టీ ఫిరాయింపులపై ఎదురు దాడి చేయనున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ టీడీపీలో ఉన్నప్పుడు అధికార పార్టీ పదే పదే సస్పెండ్ చేసిందని, ఇప్పుడు అదే పని చేయలేదని, అలా చేస్తే.. ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభ నడుపుకోలేరనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలు ఫిరాయించిన వారందరూ రాజీనామాలు చేయాలనే ఒత్తిడి పెంచాలని, తద్వారా ప్రభుత్వంపై నైతిక విజయ సాధించాలని రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది.