ఘోరం: మేనమమే కాలయముడై..

Update: 2018-06-16 05:23 GMT

మేనమామే ఆ చిన్నారుల పాలిట కాలయముడయ్యాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కనికరం లేకుండా ప్రవర్తించాడు. స్వయాన అక్క బిడ్డలైన కవలలను దారుణంగా చంపేశాడు. ఈ కిరాతకానికి పాల్పడిన నిందితుడు తర్వాత మృతదేహాలను మాయం చేసేందుకు కారులో తరలిస్తుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.  సినిమా ట్విస్టులను తలపించే రీతిలో జరిగిన ఈ క్రైమ్‌స్టోరితో  హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

మిర్యాలగూడెం నుండి హైదరాబాద్ కి వచ్చిన  మల్లికార్జున్‌ ...చిన్నారులకు స్విమ్మింగ్‌ నేర్పిస్తానని తనతో పాటు  తీసుకెళ్లాడు. తన రూమ్ మెంట్ అయిన వెంకట్రామిరెడ్డి సహాయంతో ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. చిన్నారులను చంపి కారులో తరలిస్తుండగా ఇంటి యజమాని గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సహకారంతో నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడితో పాటు అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకుని  పోలీసులు విచారిస్తున్నారు. 
 
పిల్లల మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ్ముడే హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నామని తల్లి కన్నీరు పెట్టుకుంది.  చంపడానికే తమ పిల్లలను తీసుకెళ్తున్నాడని ఊహించలేకపోయామని ఇటు చిన్నారుల తండ్రి శ్రీనివాస్‌ రెడ్డి  ఆవేదన చెందుతున్నారు. మా కంటే పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునేవాడని... అలాంటి వాడు ఇలాంటి  దారుణం చేశాడంటే... నమ్మలేకపోతున్నామన్నారు.  మా కోసమే పిల్లల్ని చంపానని చెప్పడం సరికాదంటున్నారు. నా పిల్లల్ని చంపిన బామ్మర్ధిపై కేసు పెట్టుకోవాలని అనుకోవడం లేదన్నారు. 

కవల పిల్లల మర్డర్‌  ప్లాన్‌ ప్రకారమే జరిగినట్లు  పోలీసుల విచారణలో తెలుస్తోంది.  పిల్లలను హత్యచేసిన  మామ మల్లికార్జున రెడ్డిపై తల్లిదండ్రులు కేసు పెట్టకపోవడంతో  హత్య విషయంలో వీరి పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇంటికి వచ్చి పిల్లలను తీసుకువెళ్లడం వెనుక ఉన్న మిస్టరీని చేధించే పనిలో పోలీసులు ఉన్నారు. నిజంగా పిల్లల మానసిక స్థితి బాగాలేదనే మేనమామ హత్య చేశాడా... లేక తల్లిదండ్రులు చంపేయించారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే గొంతు నులిమి  హత్య చేశాడా... లేక విషం ఇచ్చి చంపాడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News