తనకు జరిగిన అన్యాయానికి సరైన న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లకు ఓ అత్యాచార బాధితురాలు రక్తంతో లేఖ రాసి పంపింది. తన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన వారికి శిక్ష పడేలా చేయాలని ఆమె లేఖలో వేడుకుంది. `ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. నిందితులకు పెద్ద పెద్ద వ్యక్తులతో సంబంధాలు ఉండటం వల్ల వారు మా బాధను పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా కేసు వెనక్కి తీసుకోవాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు` అని ఆ బాధితురాలు లేఖలో పేర్కొంది.
తీవ్ర చర్చనీయాంశమైన ఈ లేఖపై పోలీస్ అధికారులను వివరణ కోరగా.. గతేడాది మార్చి 24న తన కూతురిపై అత్యాచారం జరిపి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు దివ్యాపాండే, అంకిత్ వర్మలపై కేసు నమోదు చేశామన్నారు. అలాగే మరో గుర్తు తెలియని వ్యకి నకిలీ ఫేస్బుక్ ఖాతాలో బాధితురాలి అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుగుతుందన్నారు.