పవన్‌- కేసీఆర్‌ భేటీపై వర్మ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-01-02 05:41 GMT

పవన్, కేసీఆర్‌ భేటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ తెలంగాణ ము‌ఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కావడంతో చర్చనీయాంశమైంది. నిన్నమొన్నటి వరకూ ఇరువురి మధ్యా పెద్దగా మంచి వాతావరణం లేనప్పటికీ రాజ్‌భవన్‌లో రెండుసార్లు ముచ్చటించుకోవడం ఇప్పుడు ఏకంగా ప్రగతిభవన్‌కి వెళ్లి పవన్‌ భేటీకావడం ఆసక్తికరంగా మారింది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కలవడం రాజకీయంగా హాట్‌ టాపిక్‌ ‌గా మారింది. గవర్నర్‌ విందు సందర్భంగా రాజ్‌భవన్‌లో రెండుసార్లు కలిసి ముచ్చటించుకున్నా  ప్రగతి భవన్‌కి వెళ్లిమరీ కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలవడంపై ఆసక్తి నెలకొంది. ఇంత సడన్‌గా కేసీఆర్‌ను కలవడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందనే చర్చ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది. పైకి మర్యాదపూర్వక సమావేశమని పవన్‌ చెప్పినప్పటికీ ఈ భేటీ వెనుక ప్రధాన కారణం ఏదో ఉండే ఉంటుందని భావిస్తున్నారు.

కేసీఆర్‌తో రాజకీయాలు చర్చించలేదంటూనే తెలంగాణలో తనకూ బలముందంటూ పవన్‌ కీలక వ్యా‌ఖ్యలు చేశారు. అంతేకాదు ఈ సమావేశంలో పొత్తుల గురించి ఎలాంటి చర్చా జరగలేదన్నారు. హక్కుల సాధన కోసం కేసీఆర్‌‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్న పవన్‌ సమస్యలపై అవగాహన పెంచుకోవడానికే తాను అప్పుడప్పుడూ పెద్దలను కలుస్తూ ఉంటానన్నారు. అయితే కేసీఆర్‌‌తో భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్న పవన్‌ కేవలం గుడ్‌విల్‌ కోసమే కలిశానని స్పష్టంచేశారు. 

అయితే రాంగోపాల్‌వర్మ మాత్రం ఈ భేటీని హైలెట్ చేస్తూ పాత చరిత్రలను తిరగేసి మరోసారి తాను వర్మనని నిరూపించుకున్నారు. పవన్ కల్యాణ్ గతంలో కేసీఆర్‌‌ తాట తీస్తానన్న మాటల్ని అలాగే పవన్‌పై కేసీఆర్ తిట్ల పురాణాన్ని గుర్తుచేస్తూ పోస్ట్‌ పెట్టారు. అవసరం, సమయం రాజకీయ నాయకులని ఎంతకైనా మార్చేస్తుందన్నారు. జై రాజకీయ నాయకుల్లారా! అంటూ కేసీఆర్‌కి పవన్ శుభాకాంక్షలు తెలుపుతున్న ఫొటోని పోస్ట్ చేశారు.

Full View

Similar News