తమిళ ప్రేక్షకులు తనపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో...తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమను చూపిస్తున్నారని ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు. కాలా ప్రీ రిలిజ్ పంక్షన్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్, దాసరి నారాయణరావులతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్, దాసరి నారాయణరావులను గుర్తు చేసుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. తాను హైదరాబాద్ వచ్చిన ప్రతి సారి ఎన్టీఆర్ని కలిసేవాడినన్న ఆయన...ఆశీర్వాదం తీసుకునే వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. బాలచందర్ తర్వాత గౌరవించే వ్యక్తులలో దర్శకరత్న దాసరి నారాయణ రావు...తనకు గురువు లాంటి వారన్నారు. ఆయన తనను కొడుకులా చూసుకున్నారని...ఆయన్ను చాలా మిస్ అవుతున్నట్లు భావోద్వేగానికి గురయ్యారు.
చాలా కాలం తర్వాత తెలుగులో తనకు బ్రేక్ ఇచ్చింది మోహన్బాబేనన్న రజినీ...పెదరాయుడు సినిమాతో మోహన్ బాబు తనకు మంచి విజయాన్ని అందించాడన్నారు. 1995లో విడుదలైన పెదరాయుడు సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యిందన్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఒకే రజినీకాంత్ అన్న ధనుష్ వ్యాఖ్యలకు...తనదైన శైలిలో స్పందించారు రజినీకాంత్. అయితే ఒకే చిరంజీవి.. ఒకే బాలకృష్ణ.. ఒకే నాగార్జున.. ఒకే వెంకటేశ్.. అంటూ అందరూ ఒక్కొక్కరే ఉంటారని అన్నారు. ఎవరి ప్రాధాన్యం వారికి ఉంటుందన్న ఆయన...ఏ రంగంలోనైనా అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నారు. కొందరు దాన్ని లక్ అంటే.. దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్లు ఆయన ఆశీర్వాదం అంటారని చెప్పారు.
1978లో అంతులేని కథతో నా తెలుగు సినీజీవితం ప్రారంభమైనా.. నన్ను వెండితెరకు పరిచయం చేసిన బాలచందర్ సూచనతో తమిళంకే ప్రాధాన్యమిచ్చానని చెప్పారు. అయితే తమిళ ప్రేక్షకులు నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో..తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ప్రేమను చూపిస్తున్నారు.