అది కేరళ పద్మనాభ స్వామి ఆలయం తరహా నిధి. అపార సంపద ఉన్న ఖజానా. కానీదాన్ని తెరవడం కొన్ని దశాబ్దాలుగా కుదరడం లేదు. ఆ భాండాగారాన్ని తెరవడానికి యత్నించిన ప్రతిసారీ ఏదో అడ్డంకి ఎదురవుతుంది. ప్రసిద్ధ పూరి జగన్నాథ ఆలయంలోనే. జగన్నాథ ఆయంలో ఓ రత్నభండాగారం ఉంది. దాన్ని తెరిచేందుకు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దిసేపట్లో తెరుస్తారు లోపల ఏముందో తేలుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో తెలిసిన నిజం అందర్నీ షాక్కు గురి చేసింది. రత్న భాండాగారం ప్రధాన గది తాళం చెవి మాయమవ్వడం కలకలం రేపింది.
తాళం చెవి మాయమైన రత్నభాండాగారంలో వెలకట్టలేని సంపదలున్నాయి. రత్న భండారంలోని ఏడు గదుల్లో అమూల్యమైన వజ్రవైఢూర్యాలు, మణిమాణిక్యాలు, బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ భండారాన్ని తెరిచేందుకు ఒడిషా హైకోర్టు నుంచి అనుమతులు రావడంతో సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ ఇంతలోనే తాళం చెవి మాయమైందనే వార్త తెలిసింది.
నిజానికి పూరి జగన్నాథ ఆలయం భాండాగారం ప్రధాన గదికి మూడు తాళాలున్నాయి. ఈ మూడింటిని పెట్టి తెరిస్తేనే తలుపు తెరుచుకుంటుంది. ఒక తాళం చెవి పూరీ రాజు గజపతి దివ్యసింగ్దేవ్ దగ్గర, మరోకటి సెక్యూరిటీ సిబ్బంది దగ్గర , మూడో తాళం చెవి పాలనాధికారి దగ్గర ఉంటాయి. గత ఏప్రిల్ 4న ఒడిషా హైకోర్టు ఆదేశాల మేరకు గదిని తెరవడానికి నిపుణులు, అధికారులు లోనికి వెళ్లారు. కానీ వెంటనే తిరిగొచ్చారు. కలెక్టర్ ఆధీనంలో ఉండే తాళం చెవి లేకపోవడంతో వీరు మూడో గది లోపలికి వెళ్లలేకపోయారు.
ప్రభుత్వం ఖజానాలో మూడో తాళం చెవి మాయమైన ఘటనపై ఒడిషా ముఖ్యమంత్రి నవీన్పట్నాయక్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ రఘువీర్దాస్ కమిషన్ ఏర్పాటు చేశారు. తాళం చెవి మిస్సింగ్ కేసు దర్యాప్తు ఏ కోణంలో జరగనుంది..? ఎవరెవరిని ప్రశ్నిస్తారు..? తాళం చెవి ఆచూకీ తెలుస్తుందా..? భాండాగారం తలుపులు తెరిపించి సంపద లెక్కింపు దిశగా చర్యలు తీసుకుంటారా? ఇలా... భక్తుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.