పరీక్షల్లో ఎక్కువ మార్కులు కావాలంటే ముద్దివ్వాలంటూ ఓ 17 ఏళ్ల విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేసిన 35 ఏళ్ల జూనియర్ కాలేజీ ప్రొఫెసర్ చివరికి కటకటాలపాలయ్యారు. ఈ నెల 8న జరిగిన ఈ ఘటనకు సంబంధించి ముంబైలోని ఘట్కోపాల్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, బాధిత విద్యార్థిని జూనియర్ కాలేజీలో కామర్స్ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఎక్కువ మార్కులు కావాలంటే ముద్దివ్వాలంటూ ప్రొఫెసర్ చేసిన డిమాండ్కు విద్యార్థిని డిప్రెషన్లోకి వెళ్లిపోయింది.
కుమార్తె వింత ప్రవర్తనతో అప్రమత్తం అయిన తల్లిదండ్రులు ఆరా తీయడంతో జరిగిన విషయం బయటపడింది. ఈ విషయం పోలీసులకు తెలియజేయడంతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో చాలా మంది పిల్లల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన మార్చి 8న జరిగినట్లు విద్యార్థిని వెల్లడించింది. శనివారం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.