జమ్మూకశ్మీర్లో గవర్నర్ పాలన విధించారు. గవర్నర్ పాలనకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో మూడున్నరేళ్లుపాటు సాగిన పొత్తుకు బీజేపీ నిన్న గుడ్బై చెప్పింది. దీంతో మొహబూబా ముఫ్తీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనందున కేంద్రపాలన విధించాలని గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రా సిఫారసు చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఒక నివేదికను పంపారు. నివేదికను పరిశీలించిన రాష్ర్టపతి కోవింద్.. జమ్మూకశ్మీర్ లో గవర్నర్ పాలనకు ఆమోదం తెలిపారు.
మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరిస్తున్నామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ నిన్న ఢిల్లీలో ఆకస్మికంగా ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని అదుపు చేసేందుకు అధికార పగ్గాలను గవర్నర్ చేతికి అందించాలని నిర్ణయించామని చెప్పారు. అంతకుముందు బీజేపీ అధిష్ఠానం జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తమ సభ్యులను అత్యవసరంగా ఢిల్లీకి పిలిపించి సంప్రదింపులు జరిపింది.
గత 40 ఏళ్లలో ఎనిమిదిసార్లు గవర్నర్ పాలనలోకి వెళ్లిన జమ్ముకశ్మీర్లో మరోసారి గవర్నర్ పాలనలోకి వెళ్లింది. మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి అయిన వోహ్రా 2008 జూన్ 25న గవర్నర్గా నియమితులయ్యారు. ఆయన హయాంలో నాలుగుసార్లు గవర్నర్ పాలన అమలైంది. ప్రస్తుతం రాజీనామా చేసిన ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ తండ్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ హయాంలోనూ. ఆయన మృతి చెందిన సమయంలో పీడీపీ, బీజేపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో 2016 జనవరి 8న, మళ్లీ ఇప్పుడు.. జమ్ముకశ్మీర్లో గవర్నర్ పాలన విధించారు.