ప్రభుత్వాసుపత్రిలో బాలింత మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. నిమ్మనపల్లె మండలం కొండసానివారిపల్లెకు చెందిన చల్లా శేషాద్రి భార్య సుమతి (23) గర్భం దాల్చింది. ఆమె ఇటీవల పుట్టినిల్లు గుర్రంకొండ మండలం తరిగొండ రుద్రవారిపల్లెకు వెళ్లింది. అయితే మంగళవారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు మదనపల్లె ప్రభత్వాసుపత్రికి తీసుకువచ్చారు. బాలింతను పరిశీలించిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ అవసరమని సూచించారు.
కుటుంబ సభ్యుల అనుమతి మేరకు రాత్రి తొమ్మిది గంటలకు సిజేరిన్ చేసి బిడ్డను తీశారు.
ఈ క్రమంలో బాలింతకు అధిక రక్తస్త్రావం అవుతుండడంతో డాక్టర్లు రాత్రి 10 గంటల సమయంలో మరోసారి ఆపరేషన్ చేశారు. దాంతో రక్తస్త్రావం ఆగిపోయింది. అయితే బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సుమతికి లో బీపీ వచ్చి తీవ్ర అస్వస్థతకు గురైంది. హుటాహుటిన ఆమెను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.