ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వలసలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక పార్టీ నుంచి మరోక పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. రాజకీయ నేతలు వరుసపెట్టి ఒక పార్టీ నుంచి మరోక పార్టీలోకి జంప్ అవుతున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి, జనసేనలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలలో వైసీపీ నుంచి జనసేనలోకి క్యూ కడుతున్నారు నేతలు. దీంతో గోదావరి జిల్లాలలో వైసీపీకి షాక్ ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇటీవలే డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ, వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీ దుర్గేష్ జనసేనకు జై కొట్టారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరోబలమైన నేత పితాని బాలకృష్ణ జనసేనకు జై కొట్టారు. పవన్ గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు జనసేనలో చేరతానని పవన్ కు బాలకృష్ణ ఆయనతో చెప్పారు. శెట్టిబలిజ వర్గీయులకు రాజకీయాల్లో సరైన ప్రాధాన్యం దక్కడంలేదన్నారు. జనసేన సిద్ధాంతాల్లో ఒకటైన ‘కులాలను కలిపే ఆలోచన’ను తూర్పు గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ అన్నారు.