శవం శివంతో సమానంగా గౌరవించే సంస్కృతి మనది.. బతికున్నప్పుడు ఎలా ఉన్నా.. చనిపోయిన వ్యక్తిని గౌరవిస్తుంటాం.. అయితే ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో శవాలకూ దిక్కు లేకుండా పోతోంది. శవాలను సకాలంలో పోస్టుమార్టం నిర్వహించక పోవడమే కాకుండా.. ఉన్నవాటికి రక్షణ కల్పించలేకపోతున్నారు సిబ్బంది.. ఫలితంగా పందికొక్కులు, ఎలుకలు శవాలను పీక్కుతింటున్నాయి. డంపింగ్ రూమ్లో భారీగా శవాలు పేరుకుపోవడం.. ప్రధాన రహదారికి ఆనుకుని మార్చురీ ఉండటంతో కుక్కలు శవాల కాళ్లు, చేతులు పీక్కుతిన్న ఘటన గతంలో సంచలనం సృష్టించాయి..
తాజాగా.. హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్సాగర్కు చెందిన ఉమ సోమవారం ఆత్మహత్య చేసుకుంది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. అప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు విధులు ముగించుకుని వెళ్లిపోవడంతో యువతి బంధువులు శవాన్ని మార్చురీ సిబ్బందికి అప్పగించి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం వచ్చి శవాన్ని పరిశీలించగా.. ముక్కు, పెదాలు, మెడ భాగం ఛిద్రమై కన్పించాయి. దీంతో మార్చురీ సిబ్బందిపై యువతి బంధువలు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు..
ఉస్మానియా వైద్య కళాశాలకు అనుబంధంగా ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో మార్చురీ కొనసాగుతోంది. ఇక్కడికి ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో చనిపోయిన వారి మృతదేహాలే కాక గ్రేటర్ శివారు ప్రాంతాల నుంచి మెడికో లీగల్ కేసులకు సంబంధించిన శవాలు వస్తుంటాయి. ఇలా రోజుకు సగటున 20–25 శవాలు వస్తుంటాయి. రోజుకు సగటున 15 శవాలకు పోస్టుమార్టం చేసే అవకాశం ఉంది.
శవాలను భద్రపరిచేందుకు 32 ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి.. పోస్టుమార్టం తర్వాత మూడు రోజుల వరకూ బాడీలను ఇక్కడ భద్రపరిచే వీలుంది..అప్పటికే బాడీ డీకంపోజ్ అయితే డంప్ రూమ్లోకి తరలిస్తారు. బంధువులు శవాలను గుర్తించి తీసుకెళ్లగా, మిగిలిన వాటిని అనాథ శవాలుగా పరిగణించి జీహెచ్ఎంసీకి అప్పగిస్తారు. వీటిని ప్రతి పది రోజులకు ఓసారి సామూహిక దహనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయా వార్డుల్లో భారీగా శవాలు పేరుకుపోతున్నాయి. వాటిని దహనం చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి..