కొండగట్టు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందగా.. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలోనే అత్యవసర చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది చేరుకున్నారు. క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తున్నారు. స్థానికులు, అధికారులు, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు. ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణనష్టంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరోవైపు బస్సు ప్రయాణిస్తున్న మార్గంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బస్సు దారి తప్పి ఘాట్ మార్గంలోకి వచ్చిందని.. అసలు ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణించే అవకాశమే లేదని స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సైతం ఇదే రీతిలో స్పందించారు. ఈ మార్గం ఆర్టీసీ బస్సుల ప్రయాణానికి అనువుగా ఉండదని.. అందువల్ల ఆర్టీసీ బస్సులు ఈ మార్గంలోకి రావని ఆయన తెలిపారు. అయితే ఈ బస్సు మాత్రం ఎలా వచ్చిందన్న కారణాలపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.