సర్వేల అంచనాలు తలకిందులు చేస్తూ కమలం వికసించించింది. సీఎం సిద్దరామయ్య ప్రజాకర్షక పథకాలు, లింగాయత్లకు ప్రత్యేక మైనారిటీ హోదా తీర్మానం, ఇతర జిమ్మిక్కులేవీ బీజేపీ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. మళ్లీ సిద్ధరామయ్యే గద్దెనెక్కుతారని చెప్పిన ప్రీపోల్ సర్వేలు, ఏ పార్టీకి మెజారిటీ రాదనీ, కింగ్మేకర్గా జేడీఎస్ ఆవిర్భవిస్తుందని చెప్పిన ఒపీనియన్ పోల్స్ అంచనాలు వమ్ము చేస్తూ బీజేపీ మ్యాజిక్ ఫిగర్కి కొద్ది దూరంలో నిలిచింది. దీంతో కమలదళ విజయానికి కారణాల విశ్లేషణలో పడ్డారు రాజకీయ విశ్లేషకులు.
సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో నెగ్గడానికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. లింగాయత్లకు మైనారిటీ హోదా కాంగ్రెస్ పార్టీకి అంతగా కలిసి రాలేదనిపిస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు లింగాయత్లకు ప్రత్యేక మైనారిటీ హోదా కల్పించి వారి ఓట్లు కొల్లగొట్టేందుకు సీఎం సిద్ధరామయ్య పన్నిన వ్యూహాలు బెడిసికట్టాయని భావిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్ర జనాభాలో సుమారు 17 శాతం లింగాయత్లు ఉంటారు. ఉత్తర కర్ణాటకలో లింగాయత్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సుమారు 100 అసెంబ్లీ సెగ్మెంట్లలో లింగాయత్లు ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు. సంప్రదాయకంగా బీజేపీకే లింగాయత్లు మద్దతిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు కొన్ని రోజుల ముందే లింగాయత్లకు మైనార్టీ హోదాను ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది.
అయితే లింగాయత్లను ఆకర్షించేందుకుగాను ఆయా పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేశాయి. ప్రస్తుతం పార్టీలవారీగా వచ్చిన సీట్లను బట్టి చూస్లే కాంగ్రెస్ పార్టీకి లింగాయత్ల ఆదరణ పెద్దగా దక్కలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లింగాయత్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 16 అసెంబ్లీ స్థానాల్లో పైచేయి సాధించగా లింగాయత్లు బలంగా ఉన్న 36 అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోవడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు.