నిర్లక్ష్యం... అలక్ష్యం.. ఇలా ఏం చెప్పుకున్నా... కొండగట్టు ప్రమాదానికి డ్రైవరే కారణమన్న సంగతి తేలిపోయింది. ఎలా నడిపినా పదుల సంఖ్యలో ప్రయాణికులను తనతో పాటే అనంతలోకాలకు తీసుకెళ్లాడు డ్రైవర్ శ్రీనివాస్. కొండగట్టు ప్రమాదానికి కారకుడిగా చెబుతున్న శ్రీనివాస్ మొన్నటి స్వాతంత్ర దినోత్సవాన ఉత్తమ అవార్డు పొందాడు. కానీ అవేమీ ప్రమాదాన్ని నిలవరించలేకపోయాయి.
కొండగట్టు బస్సు ప్రమాదానికి కారకుడిగా చెబుతున్న డ్రైవర్ శ్రీనివాస్ను ఆర్టీసీ యాజమాన్యం ఉత్తమ డ్రైవర్ అవార్డుతో సత్కరించింది. కొండగట్టు ఘాట్లో ఘోర ప్రమాదానికి డ్రైవర్ శ్రీనివాస్ నిర్లక్ష్యమే కారణమన్న ప్రచారం జరుగుతున్న ఈ సమయంలో ఉత్తమ అవార్డు గ్రహీత ఇంతటి ప్రమాదానికి ఎలా కారకుడయ్యాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాంసాగర్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న బస్సుకు డ్రైవర్గా ఉన్న శ్రీనివాస్కు డ్రైవింగ్లో మంచి అనుభవం ఉందని చెబుతున్నారు తోటి డ్రైవర్లు. వాస్తవానికి రాంసాగర్ నుంచి కొండగట్టు రాకుండా జగిత్యాల మెయిన్రోడ్డుకు వెళ్లాలి బస్సు. కాకపోతే కలెక్షన్ పెంచుకోవడంతో పాటు ప్రయాణికులకు మరింత దగ్గర కావడానికి ఈ జులై నుంచి రాంసాగర్ నుంచి వయా శనివారపుపేట కొండగట్టు మీదుగా జగిత్యాలకు వెళ్తుంది. అదే ప్రాణాల మీదికి తెచ్చింది.
కొండగట్టు ఘాట్రోడ్డుపైకి అస్సలు ఆర్టీసీ బస్సులను అనుమతి లేదు. కేవలం భక్తులు రావడానికి, వారి వాహనాలు మాత్రమే రావడానికి అనుమతి ఉంది. రోడ్డు బాగా లేదని తెలిసినా డ్రైవర్లపై ఒత్తిడి తెస్తూ యాజమాన్యం ప్రమాదానికి పరోక్షంగా కారణమైందన్న ప్రచారం జరుగుతుంది. అదే డ్రైవర్ శ్రీనివాస్ను ప్రమాదమార్గం వైపు నడిపించిందని చెబుతున్నారు స్థానికులు.