కరుణానిధికి సీరియస్ ..

Update: 2018-08-07 02:26 GMT

రాజకీయ కురువృద్దుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ప్రస్తుతం సీరియస్ గా ఉందని వైద్యులు వెల్లడించారు. అయనకు 24 గంటలపాటు శరీర అవయవాలు సహకరిస్తేనే వైద్యం చేయడానికి వీలు అవుతుందని హెల్త్ బులిటెన్ విడుదల చేశారు కావేరి వైద్యులు. అయితే సోమవారం రాత్రి శరీర అవయవాలు సరిగ్గానే పనిచేస్తున్నప్పటీ వృద్ధాప్య సమస్యలు ఆయన కోలుకునేందుకు సవాల్‌గా మారాయని హెల్త్‌ బులెటిన్‌ పేర్కొంది. 'వచ్చే 24 గంటలపాటు వైద్య సేవలకు ఆయన శరీరం ఎలా సహకరిస్తుందనేదే కీలకం'అని కావేరీ ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరవిందన్‌ సెల్వరాజ్‌ స్పష్టం చేశారు. ఇదిలావుంటే ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసి యాభైయేళ్లపాటు రాజకీయాల్లో కొనసాగుతున్న కరుణానిధికి రాజకీయ నేతల పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే  తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నాయకులతోపాటు జాతీయ నాయకులూ, రాష్ట్రపతి సైతం ఆయనను పరామర్శించారు. శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కరుణానిధిని పరామర్శించారు.నిన్న (సోమవారం) వైసీపీ కీలకనేతలు బొత్స సత్యనారాయణ, ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కావేరి ఆసుపత్రిలో కరుణానిధిని పరామర్శించారు.

Similar News