కర్ణాటక నంబర్ గేమ్లో నెగ్గేదెవరు..? యడ్యూరప్ప బలపరీక్షలో గెలుస్తారా..? సీఎంగా నిలుస్తారా..? లేదంటే యడ్యూరప్పకు సీఎం పదవి మూడు రోజుల ముచ్చటే అవుతుందా..? బీజేపీ ఎత్తుగడలను తట్టుకుని కాంగ్రెస్ - కుమార స్వామి కూటమి శాసనసభలో విజయం సాధిస్తుందా..? ఇప్పడు అందరి మొదళ్ళల్లో మెదులుతున్న ప్రశ్నలివి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో ఏం జరగుతుందోనని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
యడ్యూరప్ప బలనిరూపణకు సమయం దగ్గర పడడంతో అసెంబ్లీ సాక్షిగా తేలే ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండగా, కాంగ్రెస్కు 78, జేడీఎస్కు 37 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం 221 మంది ఎమ్మెల్యేలున్న కర్ణాటక అసెంబ్లీలో సాధారణ మెజార్టీ 111. అంటే బీజేపీకి ఇంకా ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మ్యాజిక్ ఫిగర్కు ఏడుగురు సభ్యులు అవసరం ఉండటంతో కాంగ్రెస్, జేడీఎస్, స్వతంత్ర సభ్యులను తనవైపు తిప్పుకునేందు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
ఇక కాంగ్రెస్ జేడీఎస్కు కలిపి 115 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. జేడీఎస్తో పొత్తుతో ఎన్నికైన బీఎస్పీ ఎమ్మెల్యే కూడా వారికి అండగా నిలిచారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్, బీఎస్పీల కూటమికి 116 మంది ఎమ్మెల్యేల బలం తేలింది. మరో ఇండిపెండెంటు కూడా జేడీఎస్- కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తారని చెబుతుండటంతో కూటమి బలం 117కి పెరిగింది.ఇ ది సాధారణ మెజారిటీ అయిన 111 కంటే ఎక్కువే.
అయితే కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది, జేడీఎస్ నుంచి ఇద్దరు, మరో ఇద్దరు స్వతంత్రుల మద్దతు బీజేపీకే ఉంది కాబట్టి మెజార్టీకి ఢోకా లేదని కమలనాథులు లెక్కలు చెబుతున్నారు. ఇప్పటికే జేడీఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మిస్ అయ్యారంటూ జేడీఎస్ అధినేత కుమారస్వామి కూడా అంగీకరించారు. బీజేపీ నేతలు ఇద్దరు శాసన సభ్యులను హైజాక్ చేశారన్న కుమారస్వామి చివరికి... వారిద్దరూ తమ వెంటే వస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
మరి బీజేపీ నేతలు చెబుతున్నట్లు ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలే జంప్ అయ్యారా..వారి దారిలోనే ఇంకొంతమంది ఉన్నారా..అసెంబ్లీ వేదికగా ఏమి తేలుతుందనేది అనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.