మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్లుగానే కర్నాటకలో హంగ్ ఫలితాలు వచ్చాయి. మధ్యాహ్నం వరకు స్పష్టమైన ఆధిక్యం చూపించిన బీజేపీ... కౌంటింగ్ పూర్తయ్యేసరికి సాధారణ మెజారిటీకి 8 సీట్ల దూరంలో ఆగిపోయింది. పోలింగ్ జరిగిన 222 స్థానాల్లో బీజేపీ 104 సీట్లలో విజయం సాధించగా, కాంగ్రెస్ 78 స్థానాల్లో, జేడీఎస్ 38 చోట్ల విజయం సాధించాయి. ఒక్క సౌత్ కర్నాటక మినహా ...మిగతా అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ ఆధిపత్యం చూపించింది. ముంబై కర్నాటకలో మొత్తం 50 సీట్లుంటే... బీజేపీ 30 స్థానాల్లో, కాంగ్రెస్ 17, జేడీఎస్ 2, ఇండిపెండెంట్ ఒక స్థానంలో విజయం సాధించాయి.
ఇక తెలుగు ప్రజలు అధికంగా ఉంటే హైదరాబాద్ కర్నాటకలోనూ బీజేపీ పట్టు నిలుపుకుంది. ఇక్కడున్న 31 స్థానాల్లో అత్యధికంగా కాంగ్రెస్ 15 సీట్లు గెలిచినా.... కమలదళం కూడా 12 స్థానాల్లో విజయం సాధించి గట్టిపోటీనిచ్చింది. అయితే హైదరాబాద్ కర్నాటకలో పెద్దగా పట్టులేని జేడీఎస్... 4 సీట్లు కైవసం చేసుకుంది. కోస్టల్ కర్నాటకలో అయితే బీజేపీ దాదాపు క్లీన్స్వీప్ చేసింది. మొత్తం 21 సీట్లలో కమలనాథులు 18 సీట్లు గెలిస్తే.... కాంగ్రెస్ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఇక సెంట్రల్ కర్నాటకలోనూ కమలానిదే పైచేయి అయ్యింది. ఇక్కడ బీజేపీ 24 సీట్లు కైవసం చేసుకుంటే.... కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది.
అత్యధిక సీట్లున్న సౌత్ కర్నాటకలో మాత్రం పరిస్థితి తారుమారైంది. ఇక్కడ జేడీఎస్ పట్టును నిలుపుకుంది. జేడీఎస్ మొత్తం 38 సీట్లలో విజయం సాధిస్తే.... ఒక్క సౌత్ కర్నాటకలోనే 25 స్థానాలు కైవసం చేసుకుంది. బీజేపీ 9, కాంగ్రెస్ 16 చోట్ల విజయం సాధించాయి. కుమారస్వామికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేయడంతో....పార్టీ సీనియర్ నేతలతో దేవెగౌడ అత్యవసర సమావేశమైయ్యారు. కాంగ్రెస్ ఆఫర్పై విస్తృత మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు కుమారస్వామి ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేతలు గులాంనబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్లు... జేడీఎస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్న కాంగ్రెస్ లీడర్లు.... ఈ సాయంత్రం జేడీఎస్తో కలిసి సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది.