ముంబైలోని వాంఖెడే మైదానం వేదికగా ఆదివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ ట్రోఫీ కోసం తుది సమరంలో తలపడనున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్లు. ఐపీఎల్ కు రెండేళ్ల విరామం అనంతరం పునరాగమనంలో అదరగొట్టిన చెన్నై జట్టు ఫైనల్ కు చేరింది, అసలు అంచనాలే లేని స్థితి నుంచి అద్భుతంగా పైకెదిగిన హైదరాబాద్ జట్టు చెన్నైకి పోటీగా ఎదిగింది. వీరిద్దరూ నేడు తుది సమరంలో తమ ప్రతాపాలు చూపించనున్నారు. చెన్నైకిది ఏడో ఫైనల్కాగా.. సన్రైజర్స్ మూడేళ్లలో రెండో ఫైనల్ ఆడబోతోంది. చెన్నై పరుగుల వరదకోసం వాట్సన్,. రాయుడు, రైనా, ధోనీలపైనే ఆధారపడింది. చివరి మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్, ఆల్రౌండర్ బ్రావోలపై ఆశలు మరింత ఎక్కువయ్యాయి. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఎంగిడి, చాహర్, హర్భజన్, బ్రావో, జడేజా లతో చన్నై జట్టు బలీయంగా ఉంది. ఇదిలావుంటే అందరి అంచలనాలను తారుమారు చేస్తూ ఫైనల్ కు చేరిన హైదరాబాద్ జట్టు ముఖ్యంగా పరుగుల కోసం కెప్టెన్ కేన్ విలియమ్సన్, శిఖర్ ధావన్ లెగ్స్పిన్నర్ రషీద్ ఖాన్ లపై ఆశలు పెట్టుకుంది. షకిబ్, యూసుఫ్ పఠాన్ వంటి ఆటగాళ్లు తమ బ్యాటుకు పనిచెప్పాల్సిన అవసరముంది. బౌలింగ్ పరంగా హైదరాబాద్ జట్టు ప్రత్యర్థికంటే బలంగానే ఉంది. సన్ రైజర్స్ బౌలర్లు రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్, భువనేశ్వర్, కార్లోస్ బ్రాత్వైట్, సందీప్ శర్మ, షకిబ్ వంటి హేమాహేమీలు ఉన్నారు.