అత్యంత ధనిక దేశమంటే మనకు ముందుగా గుర్తొచ్చేది అమెరికా. అయితే ఈ అగ్ర రాజ్యానికి కేవలం ఐదంటే ఐదడుగుల దూరంలో నిలిచింది భారత్. పొరుగు దేశం చైనాకు గట్టి పోటీనిచ్చిన భారత్ అత్యంత సంపన్న దేశాల్లో ఆరో స్థానాన్ని దక్కించుకుని సత్తా చాటింది. సంపద వృద్ధిలో మాత్రం అగ్రరాజ్యం అమెరికాను సైతం తలదన్ని టాప్ ప్లేస్లో నిలిచింది.
భారతదేశం ప్రపంచ భాగ్య విధాతగా మారుతోంది. సంపద వృద్ధిలో టాప్ గేర్లో దూసుకుపోతున్న ఇండియా వరల్డ్ రిచ్చెస్ట్ కంట్రీస్ టాప్-10 జాబితాలో నిలిచింది. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా అగ్రరాజ్యం అమెరికా అగ్రతాంబూలం దక్కించుకోగా డ్రాగన్ కంట్రీ చైనా సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్, బ్రిటన్, జర్మనీ నిలవగా భారత్ ఆరో స్థానాన్ని దక్కించుకుని తన సత్తా చాటింది.
దేశంలో ప్రతి ఒక్కరి మొత్తం సంపదను కలిపి ఆ దేశ సంపదగా లెక్కిస్తారు. ఆస్తులు, అప్పులను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే 2017లో భారత సంపద గణనీయంగా పెరిగింది. న్యూవరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం భారత సంపద 25శాతం పెరిగి 8వేల 230 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాది ఏ దేశ సంపద కూడా ఈ స్థాయిలో పెరగలేదని, అందుకే అత్యంత సంపన్న దేశాల్లో ఆరో స్థానంలో నిలవగలిందని చెప్పింది. అలాగే దశాబ్దకాలంలో అంటే 2007నుంచి 2017వరకు భారత సంపద 160శాతం వృద్ధి చెందినట్లు న్యూవరల్డ్ వెల్త్ నివేదిక తెలిపింది.
అత్యంత సంపన్నుల జాబితాలో కూడా భారత్ సత్తా చాటింది. 3లక్షల 30వేల 400మంది సంపన్నులతో ఇండియా 9వ స్థానంలో నిలిచింది. కనీసం ఆరున్నర కోట్ల రూపాయలకు పైగా నికర సంపద ఉన్నవారిని సంపన్నులుగా లెక్కిస్తారు. సంపన్నుల జాబితాలో కూడా అమెరికా అగ్రస్థానం దక్కించుకుంది. 50లక్షల 47వేల 400మందితో టాప్లో నిలిచింది.
ఇక కుబేరుల జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. వరల్డ్ రిచ్చెస్ట్ కంట్రీస్లో నిలిచినట్లే అమెరికా, చైనా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కనీసం 6వేల 500కోట్ల రూపాయలు ఉంటే బిలియనీర్స్ అంటే కుబేరులుగా లెక్కిస్తారు. ఈ లెక్క ప్రకారం భారత్లో 119మంది కుబేరులు ఉన్నారు. ఇక మల్టీమిలియనీర్ల జాబితాలో భారత్ ఏడో స్థానంలో నిలిచింది.
సంపద వృద్ధిలో భారత్ దూసుకుపోతున్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక చెబుతోంది. 2016లో భారత సంపద 6వేల 584 బిలియన్ డాలర్లు ఉంటే, 2017లో అది 25శాతం పెరిగి 8వేల 230 బిలియన్ డాలర్లకు చేరింది. అంతేకాదు గత పదేళ్లలో భారత సంపద రెండున్నర రెట్లు పెరిగింది. 2007లో భారత సంపద 3వేల 165 బిలియన్ డాలర్లు ఉంటే 2017నాటికి అది 8వేల 230 బిలియన్ డాలర్లకు చేరింది. మొత్తానికి న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం అత్యంత సంపన్న దేశాల్లో భారత్ ఆరోస్థానంలో నిలవగా, సంపద వృద్ధిలో మాత్రం టాప్ ప్లేస్లో నిలిచి టాప్-5 కంట్రీస్కి భారత్ సవాల్ విసురుతోంది.