ఇటీవల పాకిస్థాన్ లో జరిగిన ఎన్నికలలో పాక్ మాజీ క్రికెటర్ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు.కాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తాము హాజరవుతామని భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ లు తెలిపారు. పాకిస్తాన్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తానని భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు. ఇక ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో 1992లో పాక్ జట్టు వన్డే ప్రపంచకప్ నెగ్గిన విషయాన్ని సిద్ధూ ప్రస్తావించారు. ఇమ్రాన్ నమ్మదగ్గ వ్యక్తి అని, వ్యక్తిత్వమున్న మంచి మనిషి అని సిద్ధూ కొనియాడారు. భారత్-పాక్ల మధ్య సంబంధాలు అభివృద్ధి చేసేందుకు ఇమ్రాన్ కృషి చేస్తారని ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి భారత్ నుంచి అధికారికంగా ఎవరెవరు వెళతారోనన్న ఆసక్తి నెలకొంది. తాజాగా క్రికెటర్లు కపిల్ దేవ్, సిద్ధూ ఇద్దరు హాజరవుతున్నారన్న వార్తలపై భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటన చేయలేదు. మరోవైపు ఫారిన్ లీడర్స్ ను ఎవ్వరిని కూడా ఆహ్వానించకపోవడం గమనార్హం.