మొదటి చిత్రం దెబ్బతో బాగా డిస్ట్రబ్ అయిన అక్కినేని అఖిల్, తండ్రి అక్కినేని నాగార్జున..రెండో సినిమా ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నో కథలు..మరెంతమందో దర్శకులతో చర్చలు జరిపి చివరికి...
`మనం`లాంటి ఓ మరపురాని చిత్రాన్ని అందించిన విక్రమ్ కె.కుమార్ దర్శకుడిని ఎంచుకున్నాడు. సినిమా ప్రారంభం నుంచి ప్రమోషన్ల వరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు అక్కినేని ఫ్యామిలీకి అచ్చొచ్చిన డిసెంబర్ నెలలో సినిమా విడుదల చేసి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మరి హలోతో నాగార్జున ఆ అదృష్టం వరించిందా లేదా అనేది తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:
అనాథ అయిన శీను(అఖిల్) తన పాటలతో అందర్ని మెప్పించేవాడు. అలా ఓ సందర్భంలో తన పాటతో పెద్దంటి ఫ్యామిలీకి చెందిన జున్ను (కల్యాణి) ఆకర్షిస్తాడు. అప్పటినుంచి శీను పాటంటే జున్నుఎంతో ఇష్టపడేది. కట్ చేస్తే ఒకానొక సందర్భంలో జున్ను కుటుంబం ఢిల్లీ వెళ్లిపోతుంది. ఓ పదిహేనేళ్ల తరువాత ఎలాగైనా శీనుని కలవాలని జున్ను ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తుంది. మరి వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు. అవినాశ్, ప్రియలుగా పరిచయమైన శీను, జున్నులు ఒకరినొకరు ఎలా గుర్తుపట్టారు? వంటి విషయాలు తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే:
చిన్నతనం లో విడిపోయిన స్నేహితులు పెద్దయ్యాక మళ్లీ కలుసుకోవాలనే కాన్సెప్ట్ చాలా సినిమాలే వచ్చాయి. అయితే మొదటి సినిమా డిజాస్టర్ తో దెబ్బతిన్న అఖిల్ హిట్ కొట్టాలనే కసితో తండ్రినాగార్జున అఖిల్కి రీలాంచ్ లాంటి సినిమా కోసం ఈ తరహా కథను ఎంచుకోవడం అభినందించాల్సిందే. పాత కథను కొత్త గా తెరకెక్కించాలనే దర్శకుడు విక్రమ్ ప్రయత్నం బాగుందనే చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ లో ఈ సినిమా కథ ఎక్కడో విన్నామనే ఫీలీంగ్ లేకుండా డైరక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. చిన్నతనంలో విడిపోయిన స్నేహితులు పదేహేను సంవత్సరాల తరువాత కలుసుకోవాలనుకునే సమయంలో ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నారని కథ ను రక్తికట్టించాడు. సెకెండ్ ఆఫ్ లో శీను అవినాష్ గా , జున్ను ప్రియులుగా మారే వైనం. ఆ తర్వాత వారిద్దరూ తాము చిన్నప్పటి స్నేహితులమని తెలుసుకోవడం తదితర సన్నివేశాలతో సినిమా సాగుతుంది. పతాక సన్నివేశాలు బాగున్నాయి. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు దర్శకుడు. భావోద్వేగాలే సినిమాకు ప్రధానబలం.. ఆ సమయంలో రమ్యకృష్ణ, జగపతిబాబుల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. ప్రథమార్ధం తొందరగా ముగిసినట్లు అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..: అక్కినేని అఖిల్ యాక్టింగ్ ఇరగదీశాడు. అక్కినేని ఫ్యామిలీ హీరోలు అద్భుతంగా డాన్స్ చేయలేరు అనే కామెంట్ ని పటాపంచలు చేయటం కోసమే అన్నట్టుగా అఖిల్ డాన్స్ విషయంలో చాలా ఎఫర్ట్ పెట్టాడు. అది ముమ్మాటికి మెచ్చుకోవాల్సిన విషయమే. రెండో సినిమా కాబట్టి గొప్ప నటన ఆశించకూడదు కాని ఊహించిన దాని కన్నా అఖిల్ బాగా నటించాడు. బరువైన ఎమోషన్స్ ఇంకా బాగా క్యారి చేయాలంటే అనుభవం కావాలి కాబట్టి నెక్స్ట్ మూవీస్ లో ఇంకా బెటర్ గా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. .
సాంకేతికంగా : డైరక్టర్ విక్రమ్ కుమార్ , సంగీత నేపథ్యం, యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయి. అయితే దర్శకుడు విక్రమ్ ఇదివరకులా సంక్లిష్టమైన కథను ఎంపికచేసుకోలేదు. ఒక మామూలు కథనే అనుభూతిని, భావోద్వేగాలతో పండించడంలో మాత్రం సఫలమయ్యాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ విలువలు వెండితెరపై అడుగడుగునా కనిపిస్తాయి.