కశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాదుల వేట...దొరికిన వారిని దొరికినట్లు లేపేస్తున్న ఇండియన్ ఆర్మీ
దొరికిన వాడిని దొరికినట్లు లేపేస్తున్నారు. కనిపించిన వాడిని కనిపించినట్లు మట్టుబెడుతున్నారు. భారత సైన్యానికి.. ప్రభుత్వం ఫుల్ పవర్స్, గైడెన్స్ ఇచ్చేసింది. అంతే.. మనోళ్లు వేట మొదలెట్టేశారు. కశ్మీర్లో కనిపించిన ఉగ్రవాదులను.. కసి తీరా ఎన్కౌంటర్ చేసేస్తున్నారు. టెర్రరిస్టులు కనిపిస్తే చాలు.. కాల్చిపారేస్తున్నారు.
కశ్మీర్లో ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఉగ్రవాదుల కోసం భారత సైన్యం జమ్ముకశ్మీర్లో ముమ్మర వేట కొనసాగిస్తోంది. అనంతనాగ్ జిల్లాలో ఒకే రోజు నలుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. వీళ్లంతా.. ఇస్లామిక్ స్టేట్ జమ్ముకశ్మీర్ సంస్థకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ISJK చీఫ్ దావూద్ కూడా ఉన్నట్లు కశ్మీర్ డీజీపీ ఎస్ పీ వైద్ తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో ఓ పోలీసు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు.
అనంతనాగ్లోని శ్రీగుఫ్వరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఓ ఇంట్లో దాక్కున్న టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు తిప్పికొట్టేందుకు ఎదురుకాల్పులు జరిపారు. భద్రతా సిబ్బందిపైకి స్థానిక యువకులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. శ్రీనగర్, అనంతనాగ్లలో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. అల్లర్లు వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జమ్ముకశ్మీర్లో గవర్నర్ పాలన ప్రారంభమైన తర్వాత ఇదే మొదటి ఎన్కౌంటర్.
ఇప్పటికే కశ్మీర్కు అత్యున్నత దళాలను తరలించిన కేంద్రప్రభుత్వం.. తాజాగా వాటిని సమన్వయ పరిచేందుకు అనుభవజ్ఞుడైన మాజీ ఐపీఎస్ అధికారి కె.విజయ్కుమార్ను గవర్నర్ సలహాదారుగా పంపింది. 1975 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన విజయ్కుమార్కు.. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ను మట్టుబెట్టిన అనుభవం ఉంది. అంతేకాదు.. 1998-2001 మధ్యలో కశ్మీర్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్గా ఆయన విధులు నిర్వహించారు. సీఆర్పీఎఫ్కు డీజీగా కూడా ఆయన పనిచేశారు. కశ్మీర్లో ఏ దశలోనూ సంఘ విద్రోహశక్తులకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్న కేంద్రం.. ఇందులో భాగంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.