- బ్యాంకుల్లో రూ. కోట్ల డిపాజిట్లు
- 500 ఖాతాలు.. వాటిలో కోట్ల నగదు
సిర్సా: జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు వేల కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్తులున్నాయి. వివిధ బ్యాంకుల్లో దాదాపు 500 ఖాతాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కోట్లాది రూపాయల డిపాజిట్లు ఉన్నట్టు తేలింది. అలాగే బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయల నగదు ఉంది. అత్యాచారం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు డేరా బాబాను దోషిగా ప్రకటించగానే ఆయన అనుచరులు హరియాణా, పంజాబ్లలో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను తగులబెట్టారు. ఈ నష్టాన్ని గుర్మీత్ భరించాలని, ఆయన ఆస్తుల నుంచి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు.
పలు రాష్ట్రాలలో ఉన్న డేరా బాబా స్థిర, చరాస్తులను అంచనా వేస్తున్నారు. అధికారుల తనిఖీల్లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. డేరాబాబా, ఆయన దత్త పుత్రిక హనీ ప్రీత్ బ్యాంకు ఖాతాలలో రూ.75 కోట్లు బయటపడ్డాయి. హరియాణా, పంజాబ్లలో స్థిరాస్తుల విలువ రూ. 1,435 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గుర్మీత్ పేరును 25 స్థిరాస్తులు ఉన్నట్టు గుర్తించారు. వివిధ బ్యాంకులలో మొత్తం 504 ఖాతాలు ఉన్నట్టు కనుగొన్నారు.