హైదరాబాద్ అబిడ్స్లో ఆత్మహత్య చేసుకున్న యువతి మిస్టరీ వీడింది. నీట్ పరీక్షలో అర్హత సాధించలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మయూరి కాంప్లెక్స్ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న యువతిని కాచిగూడకు చెందిన జస్లిన్ కౌర్గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ వివరాలు సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
కాచిగూడకు చెందిన జస్లిన్ కౌర్ నిన్నవిడుదలైన నీట్ ఫలితాల్లో అర్హత సాధించలేదు. అప్పటినుంచి ఆమె ముభావంగా ఉంది. ఇంట్లోవాళ్లు సముదాయించినా పరిస్థితితో మార్పు రాలేదు. కొద్ది రోజుల్లో అంతా సర్దుకుంటుందిలే అని కుటుంబసభ్యులు అనుకున్నారు. కానీ.. ఇలా ప్రాణాలు తీసుకుంటుందని ఊహించలేకపోయారు. రాత్రంతా జస్లిన్ కౌర్ను తల్లిదండ్రులు సముదాయించారు. ఫ్రెండ్స్ కూడా ధైర్యం చెప్పారు. కానీ తెల్లవారేసరికి ఘోరం జరిగిపోయింది.
నిద్ర లేవగానే మామూలుగానే ఉన్న జస్లిన్ కౌర్.. ఆ తర్వాత బయటకు వెళ్లివస్తానని చెప్పి హోండా యాక్టివాపై అబిడ్స్కు వచ్చింది. అప్పటికే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న కౌర్ మయూరి కాంప్లెక్స్కు వచ్చింది. కాంప్లెక్స్ భవనాన్ని ఓసారి చూసిన ఆమె పైఅంతస్తుకెక్కి దూకాలని నిర్ణయించుకుంది. జస్లిన్ కౌర్ బిల్డింగ్పైకి వెళుతున్నా ఎవరికి అనుమానం రాలేదు. ఒక్కసారిగా పైనుంచి జస్లిన్ కౌర్ దూకడం... పెద్ద శబ్దం రావడంతో కలకలం రేగింది. అందరూ వచ్చి చూసేసరికి జస్లిన్ కౌర్ రక్తపుమడుగులో ఉంది.
జస్లిన్ కౌర్ భవనం ఎక్కడం.. పై అంతస్తు నుంచి కిందికి దూకడం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. 108 సిబ్బంది వచ్చేసరికి ఆమె ప్రాణాలు విడిచింది. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు హోండా యాక్టివా నెంబర్ ఆధారంగా మృతి మిస్టరీని చేధించారు. కాచిగూడకు చెందిన జస్లిన్ కౌర్గా గుర్తించారు. నీట్లో అర్హత సాధించనందునే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తేల్చారు.