వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన కూతురు
వివాహేతర సంబంధం వద్దంటూ అడ్డు తగులుతున్న తండ్రిని... ప్రియుడితో కలసి మట్టుబెట్టిందో కూతురు. ఈ దారుణ ఘటన కృష్ణాజిల్లా నూజివీడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిని లింగమనేని శేషుకుమారి భర్త 2011లో చనిపోయాడు. కుమారుడి చదువు కోసం ఆమె నూజివీడులోని తుమ్మలవారి వీధిలో అద్దెకు ఉంటోంది. ఆమె తండ్రి కూడా కుమార్తె వద్దే ఉంటూ ఓ హోటల్ లో పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గ్యాస్ స్టౌవ్ మెకానిక్ వేముల వెంకటేశ్వరరావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. శేషుకుమారి తండ్రి కాజా కృష్ణప్రసాద్ కుమార్తె వద్దే ఉంటూ నూజివీడులోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. వివాహేతర సంబంధం విషయంలో కుమార్తెను హెచ్చరించాడు. తండ్రి పదేపదే అడ్డు తగులుతున్నాడని భావించిన శేషుకుమారి ఆయన అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. జూన్ 30వ తేదీ రాత్రి పది గంటల సమయంలో ప్రియుడు వెంకటేశ్వరరావుతో కలసి ఇంటిలో ఉండగా, కృష్ణప్రసాద్ బయట నుంచి గమనించి కేకలు వేశాడు. దీంతో ఇద్దరూ కలసి కృష్ణప్రసాద్ను నోరునొక్కి ఊపిరి ఆడకుండా చేశారు. అనంతరం వెంకటేశ్వరరావు ఇనుపరాడ్డుతో తలపై కొట్టి చంపారు. అనంతరం ఉదయాన్నే శవాన్ని కారు డిక్కీలో వేసుకుని ఆగిరిపల్లి, కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు మీదుగా వెలువోలు దాటి పురిటిగడ్డ సమీపంలో నిమ్మగడ్డ రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.
గుర్తు తెలియని మృత దేహంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు చూసి, తండ్రిని గుర్తు పట్టి వచ్చామని పోలీసులతో నమ్మబలికింది. పింఛను కోసం తన తండ్రి వెళ్లాడని, ఫోన్ కూడా తీసుకెళ్లలేదని చెప్పింది. అనంతరం శవాన్ని ఖననం చేయించి వెళ్లిపోయింది. అనుమానం వచ్చిన పోలీసులు కాల్ డేటాను, నూజివీడు నుంచి శవం పడేసిన స్థలం వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దీంతో, మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. శేషుకుమారి, ఆమె ప్రియుడు వెంకటేశ్వరరావులను అరెస్ట్ చేసిన పోలీసులు, రిమాండుకు తరలించారు.